Konda Surekha: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పదవీ గండం నుంచి బయటపడేందుకు చేయని ప్రయత్నాలు లేవు. కూతురు సుస్మిత పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో కొండా సురేఖను మంత్రి సదవి నుంచి తప్పించాలని
సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పెద్దలు ఎవరూ. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. కనీసం వివరణ ఇచ్చుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. దీంతో కొండా సురేఖ అధిష్టానం బాట పట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తలుపు తట్టారు.. బెంగళూరులో 15 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో ఆమె సుష్మితపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు.
పార్టీని, గాంధీ ఫ్యామిలీని విమర్శించలేదని…
ఏఐసీసీ చీఫ్తో జరిగిన సమావేశంలో సురేఖ చెప్పిన ముఖ్యాంశం ఒక్కటే.. తాను పార్టీని గానీ, గాంధీ కుటుంబాన్ని గానీ విమర్శించలేదు. సుష్మిత వ్యాఖ్యలపై ఇచ్చిన వివరణ ద్వారా తన వైఖరి పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, ఆమెకు పార్టీలో సభ్యత్వం కూడా లేదని వెల్లడించారు. తనపై కుట్ర జరుగుతోందని, పార్టీలోనే కొందరు తనను పదవి నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నాని పేర్కొన్నారు. తద్వారా పదవి కోసం రాజకీయంగా అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసే ఉద్దేశంలో సురేఖ ఉన్నారు.
దుమారం రేపిన సుష్మిత వ్యాఖ్యలు..
పరకాల అసెంబ్లీ సీటు విషయంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ‘ఎవరు రేవంత్ నా టికెట్ నిర్ణయించేది?, మీరు, మీ నాన్న, మీ తాత వచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే, టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని ఘాటుగా మాట్లాడారు. సీఎం కాంగ్రెస్ను టీడీ కాంగ్రెస్ గా మార్చేశారని , అసలు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు’అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి సురేఖకు నోటీసు జారీ చేసింది. 20కి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు మంత్రులు కూడా ఆమెపై, కుమార్తెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, తనకు సంబంధం లేదని రాతపూర్వకంగా వివరణ ఇచ్చినా ఒత్తిడి తగ్గలేదు.
గ్యారంటీ ఇవ్వని ఖర్గే..
బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో దాదాపు 15 నిమిషాలపాటు మంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీ విషయంలో పూర్తి గోప్యత పాటించారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఇక భేటీ తర్వాత ఖర్గే కూడా మంత్రి పదవికి గ్యారెంటీ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. సీఎం రాకకు ఒక్క రోజు ముందు ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో అపాయింట్మెంట్ దొరకకపోయినా, డిప్యూటీ సీఎంను కలవలేకపోయినా, పీసీసీ నుంచి సహాయం రాకపోయినా… జాతీయ అధ్యక్షుడి వద్దకు వెళ్లి వివరణ ఇవ్వడం, పార్టీ, గాంధీ కుటుంబంపై సురేఖ విధేయతను చాటుకున్నారు. మంత్రి పదవిని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. పదవి రక్షణ కోసం ఆమె చేసిన రాజకీయ పోరాటం ఇప్పుడు అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
AICC చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ
బెంగళూరులో 15 నిమిషాల పాటు ఖర్గేతో మీటింగ్
సుష్మిత వ్యాఖ్యలపై ఖర్గేకు వివరణ ఇచ్చిన కొండా సురేఖ
రాష్ట్రంలో పీసీసీ చీఫ్, ఇతర మంత్రులెవరూ అపాయింట్మెంట్…
ఇవ్వకపోవడంతో ఖర్గేతో సమావేశమైన కొండా సురేఖ
పార్టీని కానీ, గాంధీ… pic.twitter.com/WHYtELysSj
— RTV (@RTVnewsnetwork) August 24, 2026