Congress 6 Guarantees: ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు, ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాసాలన పేరుతో గ్రామ, వార్డు సభలకు శ్రీకారం చుట్టింది. తొలి రోజు నిర్వహించిన సభలకు అనూహ్య స్పందన వచ్చింది. భారీగా వివిధ పథకాలతోపాటు, రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకరోజు గడిచినా ప్రజల్లో ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏయే పథకాలకు తాము అర్హులం, ఎలా దరఖాస్తుత చేసుకోవాలి, రేషన్ కార్డు తప్పనిసరా? ఆధార్ కుటుంబంలో అందరికీ లేదు.. పథకాలు రావా? ఆధార్ అప్డేట్ చేయలేదు.. దరఖాస్తు చేసుకోవచ్చా.. ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటి నివృత్తిలో అధికారులు విఫలమవుతున్నారు. రేషన్ కార్డు తప్పనిసరి అని చెబుతూనే మరోవైపు రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తుత చేసుకోవాలని చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఇక దరకాస్తులో ఆధార్లో ఉన్న అడ్రస్ రాయాలని చెబుతున్నారు. కానీ, చాలా మంది అందులో ఉన్న అడ్రస్లో ప్రస్తుతం ఉండడం లేదు. దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలా అనేక సందేహాల నడుమ తొలిరోజు దరఖాస్తుల స్వీకరణ అయోమయం, గందరగోళంగా మారింది.
అనుహ్య స్పందన..
గ్యారంటీ స్కీంలను లబ్ధిదారులకు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. గురువారం ప్రారంభించిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, రైతుభరోసా, చేయూత పథకాలకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటామని, అందులోని చిరునామానే దరఖాస్తులో రాయాలని అధికారులు సూచించారు.
ఈ సందేహాలు తీర్చేదెవరు..
– రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకుంటే పథకాలు వర్తిస్తాయా?
– ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లో ప్రస్తుతం ఉండని వారి పరిస్థితి ఏంటి
– అద్దె ఇళ్లలో ఉంటున్నవారు గృహజ్యోతి పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి
– సొంత జాగా ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందుతుందా?
– ఉమ్మడి కుటుంబాలు ఎన్ని దరఖాస్తులు సమర్పించాలి?
– రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు?
– తెల్ల రేషన్ కార్డుకు ఎవరు అర్హులు, గ్రామీణుల ఆదాయం ఎంత ఉండాలి?. పట్టణ వాసుల ఆదాయం ఎంత ఉండాలి?
– ఇప్పటికే రైతుబంధు, ఆసరా పింఛన్ పొందుతున్నవారు మళ్లీ దరకాస్తు చేసుకోవాలా?
ఇలా అనేక సందేహాలు దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతున్నాయి. కానీ, వాటిని తీర్చేవారు మాత్రం కనిపించడం లేదు.