New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారుగా 20 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. దాదాపు పదేళ్లుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారం లోకి వచ్చాక రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మూడు నెలల క్రితం ప్రకటించింది. తాజాగా ప్రజానీకానికి గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా..
తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల క్రితం ఆరు గ్యారంటీల అర్హుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో రేషన్ కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందులో 19 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. తాజాగా వాటి పరిశీలనపై దృష్టిపెట్టింది. దరఖాస్తు చేసుకోనివారు ఉంటే రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెబుతోంది.
ఎన్నికలు ముగియగానే..
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కీలక సమాచారం వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అవుతుందని తెలిపారు. కోడ్ ముగిసిన వెంటనే అధికారులను దరఖాస్తుదారుల ఇంటికి పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ కమిటీల ద్వారా..
ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డుల జారీ కార్యక్రమం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ రెండో వారం నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించి జూలైలో కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు రేషన్కార్డు అందితే.. పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More