Bandi Sanjay Social Media Attack: బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరుడుగట్టిన హిందూ వాది. బండి సంజయ్కి కొన్ని రోజులుగా రాజకీయపరంగా ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. ఇటు సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు ఉండగా, ఇప్పుడు కొడుకు చేసిన తప్పు ఆయనను, ఆయన కుటుంబాన్ని ఇరుకున పడేశాయి. తాజాగా బండి సంజయ్ను రాజకీయంగా ఎదుర్కోలేని శక్తులు వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఆయన కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు, ముఖ్యంగా మహిళల సంబంధిత వివాదాలు సృష్టించి ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.
గత ఘటనలు తెరపైకి తెచ్చి..
గతంలో ఆయన కుమారుడిని యూనివర్సిటీ సంబంధిత వివాదం, తర్వాత పోక్సో చట్టం కింద కేసులతో టార్గెట్ చేశారు. ఇప్పుడు మరో సన్నిహిత బంధువుపై కొత్తగా అసత్య కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారాలు పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో ఉన్నాయని బండి వర్గం ఆరోపిస్తోంది. పోక్సో కేసు నమోదైనప్పుడు కూడా బండిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇప్పుడు ఆ నేతలే బండిని, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా దొంగచాటుగా దుష్ప్రచారం చేస్తున్నారు.
మంత్రి స్థాయి వ్యక్తిపై దాడి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్పై ఇలాంటి సంఘటిత ప్రయత్నాలు జరగడం వెనుక పెద్ద రాజకీయ ఆటలు ఉన్నాయని నాయకులు అంటున్నారు. కుటుంబం ద్వారా ఇమేజ్ దెబ్బతీయడం రాజకీయ సంస్కృతికి వ్యతిరేకమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
పోలీసుల విచారణ..
బండి సంజయ్పై చేస్తున్న తప్పుడు ప్రచారంపై పోలీసులు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అనధికారికంగా సోషల్ మీడియా వెనుక ఎవరున్నారని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను టార్గెట్ చేసేవారిని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
మొత్తగా బండిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి తెరచాటు రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
