Raj Kumar Case: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో రాజ్ కుమార్ సృష్టించిన నరమేధం మామూలుది కాదు. ఏకంగా ఆరుగురుని అతడు పొట్టన పెట్టుకున్నాడు. అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి పొడిచి చంపాడు. ఆ తర్వాత అతడు పారిపోయాడు. ఇతర ప్రాంతాలలో తలదాచుకోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్న నేపథ్యంలో.. ఒత్తిడి పెరిగిపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజ్ కుమార్ సృష్టించిన హత్యాకాండ వల్ల రెండు కుటుంబాల్లో ఒకే ఒక అమ్మాయి మిగిలింది. ఆ బాలిక కుటుంబంలో ఇప్పటికే రాజ్ కుమార్ నలుగురిని చంపేశాడు. ముందుగా ఆ బాలిక తండ్రిని చంపేశాడు. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఆ తర్వాత ఆ బాలిక మీద దారుణానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ బాలిక ఎదురు తిరిగింది. నాడు ఆ బాలిక తల్లి ధైర్యం చేసి అతడి నుంచి తన బిడ్డను కాపాడుకుంది. ఆ తర్వాత వారు రాజ్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో కింద కేసు పెట్టారు.
పోలీసులు అతడి దగ్గరనుంచి డబ్బులు తీసుకుని బలహీనమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో రాజ్ కుమార్ సులభంగానే బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు నిశ్శబ్దంగానే ఉన్నాడు. అనంతరం గడచిన శనివారం తెల్లవారుజామున దైవాలగూడ ప్రాంతంలో నరమేధానికి పాల్పడ్డాడు. ఏకంగా ఆరుగురుని చంపేశాడు. ఆ బాలిక కుటుంబం మీద కక్ష కట్టిన రాజ్ కుమార్.. బాలికను.. బాలిక తల్లిని.. ఆమె కుటుంబంలో మరో మహిళను చంపేశాడు. తన భార్య పిల్లల్ని కూడా కడతేర్చాడు. చివరికి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజ్ కుమార్ చంపిన బాలికకు ఒక అక్క ఉంది. ఆ దుర్మార్గుడి క్రూరత్వం వల్ల ఆమె మాత్రమే మిగిలిపోయింది. ఆ బాలిక అక్క మానసిక దివ్యాంగురాలు. దీంతో ప్రభుత్వం ఆమెకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మిస్తామని చెప్పింది. మరోవైపు రాజ్ కుమార్ మృతహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి వైద్యులు కూడా ముందుకు రాలేదు. అనేక ప్రయత్నాల తర్వాత వైద్యులు రావడంతో పోస్టుమార్టం పూర్తయింది. ఆ తర్వాత అతడి అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యుల ముందుకు రాలేదు. దీంతో పోలీసులే ఆ పని పూర్తి చేశారు.
రాజ్ కుమార్ ఆ బాలిక ఇంటికి వెళ్ళినప్పుడు.. దారుణంగా ప్రవర్తించాడు. నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆ బాలికను బయటికి తీసుకొచ్చాడు. అయితే ఆ బాలిక తల్లి.. ఆమె నానమ్మ అడ్డుకున్నారు. దీంతో చేతిలో ఉన్న కత్తితో వారిద్దరిని పొడిచి చంపేశాడు. ఆ సమయంలో మానసిక దివ్యంగురాలైన ఆ బాలిక అక్క ఇంట్లోనే వేరే గదిలో ఉంది. కాకపోతే ఆమె జోలికి రాజ్ కుమార్ వెళ్లలేదు. అందువల్లే బతికిపోయింది. ఆ బాలికను బయటికి తీసుకొచ్చి.. కారులో చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత దారుణంగా చంపేశాడు.




