Runa Mafi Survey : తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణ భారాన్ని తగ్గించేందుకు ‘రుణమాఫీ’ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ. 2 లక్షల వరకు రైతులు తీసుకున్న రుణాన్ని మొత్తం ప్రభుత్వమే చెల్లించి వారికి భారాన్ని తగ్గించింది. తెలంగాణలో రూ. 2 లక్షల వరకు రుణం తీసుకున్న వారి కోసం ప్రభుత్వం రూ.31 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న వారు, రెన్యూవల్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. అయితే ఆగస్టు 15న రూ. 2 లక్షల రుణ మాఫీ ప్రకటించిన తరువాత కొంత మందికి ఇది వర్తించలేదు. వివిధ కారణాల వల్ల వారికి రుణ సాయం అందలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చేశారు. కొన్ని చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో ప్రభుత్వం అర్హులై ఉండి, రుణ మాఫీ కాని వారి కోసం సర్వే చేపట్టింది. ఈ సర్వే ఇటీవల 50 శాతం పూర్తయింది. అయితే ఆ తరువాత ఏం చేయబోతుందంటే?
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీకి అర్హులై ఉన్న దాదాపు 4 లక్షల మందికి రుణ సాయం అందలేదు. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇంటింటికి రుణమాఫీ కాని వారి ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు రైతుల ఇళ్లల్లోకి వెళ్లి వారి వివరాలను సేకరించారు. వారికి రుణ మాఫీ కాకపోవడానికి కారణాలేంటో తెలుసుకున్నారు. ఆ తరువాత వివారాలను ప్రభుత్వానికి అందజేశారు.
సర్వే పూర్తయిన తరువాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ కాని వారిలో రేషన్ కార్డులు లేనివారు, పేర్లలో తప్పులు ఉన్నవారు, ఐటీ చెల్లించిన వారు ఉన్నారు. అయితే ప్రభుత్వం రుణ మాఫీకి అర్హులై ఉండి ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేస్తామని తెలిపింది. అందులో భాగంగానే ఈ సర్వే చేపట్టామని పేర్కొంది. ప్రస్తుతం ఈ సర్వే 50 శాతం పూర్తయినందున చిన్న చిన్న పొరపాట్లు ఉన్నవారి ఖాతాల్లో త్వరలో రుణ మాఫీ సాయం అందనున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా కొంత మంది రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్నవారికి సైతం రుణ సాయం అందజేస్తామని తెలిపింది. అయితే రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఎంత మొత్తం ఉంటుందో.. ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తారని తెలపింది. వీరి వివరాలను కూడా ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. దీంతో రూ. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్న వారికి కూడా ప్రయోజనం కలగనుంది.
రూ. 2 లక్షల రుణ మాఫీలో భాగంగా ముందుగా రూ. లక్ష వరకు మాఫీ చేశారు. ఆ తరువాత రూ. 1.50 వేలు బ్యాంకుల్లో జమ చేశారు. ఆగస్టు 15న రూ. 2 లక్షల రుణం తీసుకున్న వారికి ఆ మొత్తాన్ని అందజేశారు. అయితే చాలా మంది తమ ఖాతాలను కేవైసీ అప్డేట్ చేసుకోకపోవడంతో పాటు పేర్లలో తప్పులు ఉండడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. రైతులు నేరుగా బ్యాంకుకు వెళ్లి వారి సమస్య పరిష్కారం కోసం అధికారులను కలవాలని అంటున్నారు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More