Kavya Maran: ఐపీఎల్ ముగిసింది. కోల్ కతా విజేతగా నిలిచింది. ఫైనల్ పోరు లో ఏకపక్షంగా మ్యాచ్ సాగింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో కోల్ కతా విజయం సాధించింది. ప్లే ఆఫ్ లోనూ హైదరాబాద్ ఇదే స్థాయిలో కోల్ కతా పై విజయాన్ని అందుకుంది. ఓటమి నేపథ్యంలో జట్టు ఆటగాళ్ల ప్రదర్శన పై విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో వచ్చే సీజన్ కు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై చర్చలు కూడా సాగుతున్నాయి. గత సీజన్లో హైదరాబాద్ జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శించడం, ఈ సీజన్లో ఏకంగా రెండవ స్థానంలోకి రావడం.. ఇందుకు కమిన్స్ నాయకత్వమే కారణమని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.. ఇదే సమయంలో వచ్చే సీజన్లోనూ అతడినే కెప్టెన్ గా ఉంచుకునేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి సీజన్ కు ముందు జరిగిన వేలంలో కమిన్స్ ను కావ్య 20 కోట్లకు పైగా చెల్లించి కొనుగోలు చేసింది. అయితే ఈసారి రిటైన్ చేసుకునే క్రమంలో కొంత తక్కువ చెల్లించాలని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో కమిన్స్ చెత్త రికార్డు కావ్యకు తెలియదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ చెత్త రికార్డు ఏంటంటే..
ఈ ఐపిఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టును కమిన్స్ అన్ని రంగాలలో ముందుండి నడిపించాడు. కోల్ కతా పై మూడు మ్యాచ్ లలో ఓటమి మినహా.. మిగతా అన్నింటిలో ఆ జట్టుకు అండగా నిలిచాడు.. ఓపెనర్ల కూర్పు, బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ చేర్పు.. వంటి విషయాలలో కమిన్స్ సమర్థవంతంగా తన పాత్రను పోషించాడు. అతడి నాయకత్వం వల్లే హైదరాబాద్ జట్టు ముంబై పై 277, బెంగళూరుపై 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు సాధించిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది.. లక్నోపై పది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఢిల్లీతో జరిగిన ఓ మ్యాచ్లో పవర్ ప్లే లో ఏకంగా 125/0 స్కోర్ చేసింది. అయితే ఇన్ని ఘనతల మధ్య కమిన్స్ చెత్త రికార్డు గాలిలో కొట్టుకుపోయింది.
కమిన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచులు ఆడాడు. 61 ఓవర్లు బౌల్ చేశాడు. ఏకంగా 566 పరుగులు ఇచ్చాడు. 18 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన 43/3 గా ఉంది. ఎకానమీ రేటు ఏకంగా 9.27 ఉండడం విశేషం. ఈ సీజన్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా కమిన్స్ పేరిట చెత్త రికార్డు ఉండడం విశేషం..కమిన్స్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజువేంద్ర చాహల్ 546 రన్స్ తో మిగతా స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో 2023 సీజన్లో చెన్నై బౌలర్ తుషార్ దేశ్ పాండే 564 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అదే సీజన్లో రషీద్ ఖాన్ 552 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. 2021 సీజన్లో ప్రసిద్ద్ కృష్ణ 551 పరుగులు ఇచ్చి మొదటి స్థానంలో ఉన్నాడు. 2020 సీజన్లో రబాడ 548 పరుగులు ఇచ్చి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు.. 2018 సీజన్లో సిద్ధార్థ కౌల్ 547 పరుగులు ఇచ్చి మొదటి స్థానంలో ఉన్నాడు.. వాస్తవానికి ఇలా ఎక్కువ పరుగులు ఇచ్చిన జాబితాలో ప్రసిద్ధమైన బౌలర్లు ఉన్నప్పటికీ.. వారందరితో పోల్చితే కమిన్స్ ది భిన్నమైన శైలి. కానీ అతడు కూడా ఈ సీజన్ లో తేలిపోయాడు. భారీగా పరుగులు సమర్పించుకొని, అనామక బౌలర్ గా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరి ఇలాంటి ఆటగాడిని కావ్య రిటైన్ చేసుకొని, సన్ రైజర్స్ ను విజేతగా నిలుపుతుందా? అనే సందేహాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More