India Vs Pakistan T20 World Cup 2026: టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత జట్టుతో జరిగే మ్యాచ్ లో తాము ఆడతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు ఆమోదం తెలపడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు హర్షం వ్యక్తం చేశాయి.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల భారత అభిమానులు.. ఇతర ప్రేక్షకుల కంటే బ్రాడ్కాస్టర్లు ఎక్కువ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఐసీసీ కూడా సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తోంది. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ యూటర్న్ తీసుకోవడం వల్ల ఐసీసీ, గ్లోబల్ బ్రాడ్కాస్టర్లకు దాదాపు 1500 కోట్ల వరకు ఆదాయం మిగిలినట్లు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ గనుక రద్దయి ఉంటే మీడియా పార్ట్నర్ అయిన జియో హాట్ స్టార్ కు ఐసీసీ భారీగా పరిహారం చెల్లించాల్సి వచ్చేది. అంతేకాదు 16 సెకండ్ల ప్రకటనకు దాదాపు 25 నుంచి 40 లక్షల మధ్య సుమారు 300 కోట్ల వరకు యాడ్ రెవెన్యూ పోయేది.
స్పాన్సర్ షిప్ లు.. డిజిటల్ ట్రాఫిక్.. హోటల్ బుకింగ్ రూపంలో కూడా ఆర్థికంగా నష్టం వచ్చేది. ఇప్పటికే భారత అభిమానులు చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. హోటల్ రూములు కూడా బుక్ చేసుకున్నారు. ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకున్న తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత జట్టుతో ఆడబోమని అప్పట్లో నిర్ణయం తీసుకోవడం అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. దీంతో చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద వ్యక్తం చేశారు.
భారత్, పాకిస్తాన్ అంటే హై వోల్టేజ్ సమరం జరుగుతూ ఉంటుంది. ఇటీవల ఆసియా కప్ లో కూడా అదే స్థాయిలో రెండు దేశాల మధ్య పోటీ సాగింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో అయితే పాకిస్తాన్ బౌలర్లు వర్సెస్ ఇండియన్ బ్యాటర్లు అన్నట్టుగా సమరం సాగింది. ఈ సమరంలో ఇండియన్ బ్యాటర్లు సత్తా చూపించారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. ఫలితంగా టీమిండియా విజేతగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఫామ్ ప్రకారం చూసుకుంటే టీమిండియా పాకిస్తాన్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. అలాంటప్పుడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ గట్టి పోటీ ఇవ్వడం మినహా చేసేది ఏమీ ఉండదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.