Ishan Kishan: దాదాపు రెండు సంవత్సరాలపాటు జట్టుకు దూరమయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్లో ఆడటం లేదని.. రకరకాల సాకులు చెబుతున్నాడని మేనేజ్మెంట్ అతని మీద యాక్షన్ తీసుకుంది. అతడు కూడా అంతే పట్టింపుతో ఉండిపోయాడు. కానీ, అన్న మీద అలిగితే ఎవరికీ ఆకలవుతుందో ఇషాన్ కిషన్ కు త్వరలోనే అర్థమైంది.
అతనికి అర్థమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ దశలో అతడు జట్టులోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవీ సఫలికృతం కాలేదు. దీనికి తోడు మేనేజ్మెంట్ మరింత కఠినంగా ఉండడంతో అతడు మరో దారి లేక అతడు డొమెస్టిక్ క్రికెట్లో అడుగు పెట్టాడు. ఈసారి టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సొంత జట్టుకు ఆడాడు. ఆ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు.. ఆ సిరీస్ మొత్తంలో పరుగుల వరద పారించాడు. అంతేకాదు, జార్ఖండ్ జట్టుకు ట్రోఫీ అందించాడు.
ఎప్పుడైతే అతడు ధోని జట్టును విజేతగా నిలిపాడో.. న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్ కు ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు. అయితే తుది జట్టులో అతడికి చోటు దక్కడం అనుమానమని విశ్లేషకులు భావించారు. అయితే ఈ సిరీస్ కు ఎంపికైన తిలక్ వర్మ గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు. తొలి మ్యాచ్లో అతడు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ… ఆ తర్వాత తన బ్యాట్ పదును ఏంటో నిరూపించాడు. ఇక నాలుగో టి20 మ్యాచ్లో అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో.. ఆ ప్రభావం జట్టు విజయం మీద చూపించింది. దీంతో ఐదవ మ్యాచ్ కు అతడికి మళ్ళీ చోటు లభించింది.
తిరువనంతపురంలో శనివారం జరిగిన మ్యాచ్లో స్థానిక ఆటగాడు సంజు శాంసన్ విఫలమైనప్పటికీ.. కిషన్ మరోసారి అదరగొట్టాడు.
28 బంతుల్లో ఇషాన్ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఇదే ఊపులో సెంచరీ కూడా పూర్తి చేశాడు. 28 బంతుల్లో 50 పరుగులు చేసిన కిషన్.. ఆ తదుపరి 53 పరుగులు 15 బంతుల్లోనే చేయడం విశేషం. ఈ సిరీస్ లో ఇప్పటికే అతడు ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించిన కిషన్.. అదే జోరు న్యూజిలాండ్ సిరీస్ లో కూడా ప్రదర్శించాడు. న్యూజిలాండ్ సిరీస్లో హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐదో మ్యాచ్లో అభిషేక్ శర్మతో కలిసి రెండో వికెట్ కు 17 పరుగులు, కెప్టెన్ సూరి కుమార్ యాదవ్ తో కలిసి మూడో వికెట్ కు 137 పరుగులు, హార్థిక్ పాండ్యా తో కలిసి నాలుగో వికెట్ కు 48 పరుగులు జోడించాడు.. అతడు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో.. టి20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.