
చాంపియన్ షిప్ ఏదైనా గెలుపే ప్రధానం.. విజేతను తేల్చడమే దాని ఉద్దేశం. మర ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ డ్రా అయితే పరిస్థితి ఏంటి? రెండు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారా? ఫలితం వచ్చేంత వరకు ఆడిస్తారా? ఇంతకీ ఐసీసీ ఏం చేయనుంది.
టెస్టు చాంపియన్ షిప్ రెండేళ్ల కాలపరిమితితో ప్రవేశపెట్టిన టోర్నీ2019లో మొదలైంది. 2021లో ముగుస్తోంది. మొదట ఎక్కువ పాయింట్లు సాధించిన రెండు జట్లు ఫైనల్ ఆడతాయని ప్రకటించారు. ఆ తర్వాత చెప్పకుండానే విజయాల శాతం ఆధారంగా ఫైనల్ కు అర్హత ఉంటుందని నిబంధనలు మార్చేశారు.
సాధారణంగా సుదీర్ఘ ఫార్మట్ లో గెలుపోటములే కాకుండా జట్లు డ్రా చేసుకోవచ్చు. చాంపియన్ షిప్ అడిగినప్పుడు ఫలితం తేలకుంటే ఏంటన్న సందిగ్ధం మొదలైంది. న్యూజీలాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే చాంపియన్ షిప్ కు అర్థం ఏముంటుందని ప్రశ్నలు వస్తున్నాయి. ఇందుకోసం ఆరో రోజు ఆటను కొనసాగించాలని ఐసీసీ భావిస్తోంది.
టెస్ట్ లో రోజుకు 90 ఓవర్ల చొప్పున ఐదు రోజులకు 450 ఓవర్లు వేయాలి. పరిస్థితులు అనుకూలించక ఆయా రోజుల్లో ఆట త్వరగా ముగిస్తే మిగిలిన ఓవర్లను ఆరో రోజు వేయించాలన్నది ఐసీసీ ప్రణాళిక. ఐదు రోజుల్లో 30 గంటలు కనీసం ఆట ఆడాలి. లేకుంటే ఆరో రోజు ఆడించొచ్చు. ప్రస్తుతానికి ఈ అంశంపై స్పష్టత లేదు. జూన్ 1న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో చర్చించాక నిర్ణయం తీసుకోవచ్చు.