T20 World Cup 2024 : మీడియాలో ఎన్నో ప్రచారాలు.. సోషల్ మీడియాలో రకరకాల చర్చలు.. మాజీ క్రికెటర్ల మాటలకైతే ఇక లెక్కే లేదు.. కొందరైతే జట్టు ఖరారయిందని అంటున్నారు.. మరికొందరు జాబితాను కూడా ప్రకటించేస్తున్నారు. టి20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యే నాటికి ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది.. వినాల్సి కూడా వస్తుంది.. నిజానికి t20 వరల్డ్ కప్ సంబంధించి ఏప్రిల్ 28న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ భేటీకానున్నారు. ఆ భేటీలోనే జట్టుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టి20 వరల్డ్ కప్ భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరు మాత్రమే ఓకే అయినట్టు తెలుస్తోంది. మిగిలిన సభ్యుల ఎంపిక సంబంధించి ఇంకా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఐపీఎల్లో సగం మ్యాచులు పూర్తయ్యాయి.. ఫామ్ లో ఉన్న ఆటగాళ్లపై సెలెక్టర్లు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. జూన్ లో ప్రారంభం కానున్న టీ – 20 ప్రపంచ కప్ నకు సంబంధించి జట్టును ప్రకటించే డెడ్ లైన్ కూడా ముగుస్తోంది. దీంతో భారత జట్టు కూర్పుపై రోజురోజుకు టెన్షన్ పెరుగుతోంది. ప్రస్తుతానికి టి20 వరల్డ్ కప్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరు మాత్రమే ఖరారయినట్టు తెలుస్తోంది. మిగిలిన సభ్యుల ఎంపిక పట్ల రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఎప్పటిలాగే టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు తరుపున ఓపెనర్ గా రోహిత్ శర్మ రానున్నాడు. అయితే అతడికి జోడిగా విరాట్ కోహ్లీ వస్తాడని చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇప్పటికే అతడు 300కు పైగా పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్ ప్రకారం విరాట్ కోహ్లీని ఓపెనర్ గా పంపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే టీ20 అనేది దూకుడుకు పర్యాయపదం కాబట్టి.. భారీ స్కోరు సాధిస్తేనే విజయం సాధించే అవకాశాలుంటాయి. అందుకే విరాట్ కోహ్లీని ఓపెనర్ గా పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటివరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక్కసారి మాత్రమే ఓపెనింగ్ జోడిగా బరిలోకి దిగారు. విరాట్ కోహ్లీ మొత్తంగా 9 సార్లు ఓపెనర్ గా వచ్చాడు. పొట్టి ఫార్మాట్లో ఏకైక సెంచరీ సాధించిన ఓపెనర్ గా రికార్డ్ సృష్టించాడు..గిల్, కిషన్, జైస్వాల్ వంటి ఇతర ఓపెనర్లు కోహ్లీని బీట్ చేయలేకపోతున్నారు. దీంతో అతడే ఓపెనర్ అని అభిమానులు ఒక అంచనాకు వచ్చారు. మరోవైపు ఓపెనింగ్ లో తనకు జోడిగా కోహ్లీ పేరును రోహిత్ రికమండ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య గట్టి బాండింగ్ ఏ స్థాయిలో ఉందో.