IPL 2024: బెంగళూరులో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. క్యాన్ నీళ్ల కోసం ప్రజలు గంటలు తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తాగునీటి అవసరాలపై ప్రభుత్వం నిబంధన విధించింది. తెరపైకి అపరాధ రుసుం విధింపు వంటి యాక్ట్ ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా బెంగళూరు వాటర్ సప్లై బోర్డు స్టేడియానికి 75,000 లీటర్ల మినరల్ వాటర్ పంపిణీ చేస్తామని BWSSB హామీ ఇచ్చింది. ఈ ప్రకటన నేపథ్యంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధికారులు BWSSB అధ్యక్షుడు రామ ప్రసాద్ మనోహర్ తో భేటీ అయ్యారు. బెంగళూరు మైదానంలో నిర్వహించే అన్ని మ్యాచ్ లకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని కోరారు. “స్టేడియం కోసం కావేరి లేదా ఇతర బోర్ల నీటిని మేము సరఫరా చేయలేం. KSCA అధికారులు శుద్ధి చేసిన నీరు ఇవ్వాలని అడిగారు. వారి అభ్యర్థనను ఆమోదించాం. ఆ ప్రకారం కబ్బన్ పార్కులోని మురుగు నీటి శుద్ధి కర్మాగారం నుంచి శుద్ధి చేసిన నీటిని ఐపీఎల్ టోర్నీ నిర్వహించే బెంగళూరు మైదానానికి సరఫరా చేస్తామని” మనోహర్ ప్రకటించారు.
మంగళవారం ఈ మైదానం వేదికగా బెంగళూరు జట్టు అన్ బాక్స్ వేడుక నిర్వహించింది. దానికి కూడా బెంగళూరు వాటర్ సప్లై బోర్డు నీటిని సరఫరా చేసింది. దీంతో కొంతమంది ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. వినోదాల కోసం నీటిని సరఫరా చేయడం ఏంటని కొందరు నెటిజన్లు బెంగళూరు వాటర్ సప్లై బోర్డును ప్రశ్నించారు. అయితే ప్రజల అవసరాల కోసం నిల్వ ఉంచిన నీటిని కాకుండా, ఇతర మార్గాల ద్వారా శుద్ధి చేసిన నీటిని మైదానానికి సరఫరా చేసామని బెంగళూరు వాటర్ సప్లై బోర్డు వివరణ ఇచ్చింది..
బెంగళూరు చిన్నస్వామి మైదానంలో 32,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది. మార్చి 25న ఈ మైదానంలో తొలి ఐపిఎల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు బెంగళూరు జట్టు ఆడతాయి. మార్చి 29, ఏప్రిల్ 2న మిగతా మ్యాచ్లు జరుగుతాయి. బెంగళూరు ప్రాంతంలో తీవ్రమైన నీటి ఎద్దడిన నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లను ఈ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. అలా మ్యాచులు తరలిస్తే బెంగళూరుకి అవమానకరమని, అలా చేస్తే నిరసన తెలుపుతామని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. దీంతో బెంగళూరు వాటర్ సప్లై బోర్డు నీటిని సరఫరా చేస్తామని ప్రకటించింది. ఆ దిశగానే శుద్ధ నీటిని సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది.