Telugu News » Sports » Bcci takes action against heinrich klaasen no ball controversy in srh vs lsg ipl 2023
IPL 2023: హైదరాబాద్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ.. భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ..!
నడుము పై నుంచి బంతి వెళ్లినా నోబాల్ ఇవ్వకపోవడంపై క్రీజులో ఉన్న సమద్, క్లాసెన్ తోపాటు ఫాన్స్ షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే క్లాసెన్ ఎంపైర్ తో గొడవకు దిగాడు.
IPL 2023: పాపం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసలే కీలక మ్యాచ్ లో ఓడిపోయి బాధలో ఉంటే ఇప్పుడు మరో షాక్ తగిలింది ఆ జట్టుకు. అదే సమయంలో బీసీసీఐ కూడా సీరియస్ అయింది. హైదరాబాద్ జట్టు బ్యాటర్ కు జరిమానా కూడా విధించింది. ఇంతకూ ఏం జరిగిందో మీరు చదివేయండి.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఈ సీజన్ లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగింది. కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన బ్యాటర్లు అదరగొడతారని జట్టు యాజమాన్యంతోపాటు అభిమానులు కూడా ఆశించారు. అయితే, అదంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఇంకా చెప్పాలంటే రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ అయితే ఒకటి, రెండు మ్యాచ్ లు మినహా.. మిగిలిన మ్యాచ్ ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. తాజాగా, లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇదే తరుణంలో ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. బీసీసీఐ ఈ జట్టులోని ప్లేయర్ల ఆట తీరుపై ఫుల్ సీరియస్ అయింది.
సొంత మైదానంలోనే ఘోర పరాభవాలు..
ఈ ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకి ఏది కలిసి రాలేదు. ఒకటి, రెండు మ్యాచ్ ల్లో గెలిచి కాస్త ఆశ రేపింది కానీ జట్టులో ఏ ఒక్క ప్లేయర్ కూడా సీరియస్ గా ఆడిన దాఖలాలు కనిపించలేదు. బయట మైదానాల్లో ఓడిపోయారు అంటే సరే అనుకోవచ్చు. కానీ సొంత మైదానం ఉప్పల్ లోనే ఘోర ఓటములను మూటగట్టుకుంది ఈ జట్టు. తాజాగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చేదనలో లక్నో జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ తరఫున క్లాసెన్ ఒక్కడే బాగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు ఆ క్రికెటర్ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై బీసీసీఐ సీరియస్ కావడంతోపాటు జరిమానా కూడా విధించింది.
ఆ కామెంట్ చేయడంతో సమస్య..
హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 19 వ ఓవర్ ఆవేష్ ఖాన్ వేశాడు. మూడో బంతి హై ఫుల్ టాస్ గా వెళ్ళింది. దీంతో, ఫీల్డ్ ఎంపైర్ నో బాల్ ప్రకటించాడు. లక్నో కెప్టెన్ దీన్ని ఛాలెంజ్ చేస్తూ రివ్యూ తీసుకున్నాడు. రీ ప్లే లో థర్డ్ ఎంపైర్ బంతి క్లియర్ గా ఉందని, నోబెల్ కాదని చెప్పాడు. నడుము పై నుంచి బంతి వెళ్లినా నోబాల్ ఇవ్వకపోవడంపై క్రీజులో ఉన్న సమద్, క్లాసెన్ తోపాటు ఫాన్స్ షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే క్లాసెన్ ఎంపైర్ తో గొడవకు దిగాడు. అసలు ఇదేం ఎంపైరింగ్ అనేలా కామెంట్స్ చేశాడు. దీనిపై ఇప్పుడు బీసీసీఐ సీరియస్ అయింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.7 ఆర్టికల్ 1 ప్రకారం మ్యాచ్ ఫీజులో పది శాతం జరిమానా విధించింది. అసలే మ్యాచ్ ఓడి పరువు పోగొట్టుకున్న హైదరాబాద్ జట్టుకు ఇది మరో షాక్ అనే చెప్పాలి. ఆటతో సత్తా చాటలేనప్పుడు ఈ తరహా వివాదాలు ఎందుకని పలువురు పెదవి విరుస్తుంటే.. హైదరాబాద్ జట్టుకు ఏవి కలిసి రావడం లేదని అందుకే ఇటువంటివి జరుగుతున్నాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్ ను హైదరాబాద్ జట్టు దాదాపు ముగించినట్టుగానే భావించాలి. మిగిలిన రెండు మ్యాచ్ లో విజయం సాధించిన ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు ఈ జట్టుకు పూర్తిగా తుడిచుపెట్టుకుపోయాయి.