Tirumala Temple: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులను ఆశ్చర్యపరిచే అనేక విశేషాలు దాగి ఉన్నాయి. ఈ విషయాలు పూర్వీకుల నుంచి నేటి తరానికి కాల క్రమంగా వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో అర్చకులుగా ఉన్న వారు తమ పూర్వీకుల ద్వారా నుంచి అనేక విషయాలను తెలుసుకున్నట్లు కొందరు సందర్భానుసారంగా వెల్లడిస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న విషయం ఏమిటంటే.. స్వామివారి పాదాల వద్ద చెవి పెడితే ఇప్పటికీ నీరు ప్రవహిస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తుందనేది. అలా ఎందుకు వినిపిస్తుంది?
స్థానిక స్థలపురాణాలు, ఆలయ సంప్రదాయాల ప్రకారం ఒకప్పుడు మూలవిరాట్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పాదాల క్రింద సహజసిద్ధమైన ఒక చిన్న ఊట ఉండేదని చెబుతారు. ఆ ఊట నుంచి నిరంతరం నీరు ఉబికి వచ్చేదని, ఆ నీరు గర్భగుడి బయటకు ప్రవహించేదని పెద్దలు చెబుతుంటారు. దీనిని స్వామివారి దివ్య మహిమగా భక్తులు భావించేవారు.
కాలక్రమేణా ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు నిర్మాణాల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. 1960ల ప్రాంతంలో ఆలయంలో మరమ్మతులు, సౌకర్యాల అభివృద్ధి సమయంలో గర్భగుడిలో చేరే నీరు బయటకు వెళ్లేలా ప్రత్యేక నిర్మాణం చేసినట్లు ఆలయ చరిత్రను ప్రస్తావించే కొన్ని వర్గాలు పేర్కొంటాయి. దీంతో నీరు గర్భగుడిలో నిల్వ కాకుండా బయటకు మళ్లించే ఏర్పాట్లు జరిగాయని చెబుతారు.
అయితేఈ మార్పులు జరిగినప్పటికీ స్వామివారి పాదాల సమీపంలో చెవి ఉంచితే లోపల ఎక్కడో నీరు ప్రవహిస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తుందని అనేక మంది భక్తులు, అర్చకులు చెబుతుంటారు. కొందరు దీనిని ప్రత్యక్షంగా అనుభవించినట్లు వివరిస్తారు.
కొంతమంది పరిశోధకులు, నిర్మాణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తిరుమల కొండ సహజ శిలా నిర్మాణాల మధ్య భూగర్భ జలప్రవాహాలు ఉండే అవకాశం ఉంది. ఆలయ నిర్మాణం కూడా రాతి ఆధారంగా ఉండటంతో, నీటి ప్రవాహ ధ్వని ప్రతిధ్వనించి వినిపించే అవకాశం ఉందని వారు భావిస్తారు.