Homeజాతీయ వార్తలుBhadrachalam Temple Treasures : తెలంగాణ దేవుడు రాముడు నేడు దెయ్యం ఎందుకయ్యాడు

Bhadrachalam Temple Treasures : తెలంగాణ దేవుడు రాముడు నేడు దెయ్యం ఎందుకయ్యాడు

Bhadrachalam Temple Treasures  : ‘నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది’. ఇదీ ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమైన ‘రామా కనవేమిరా’ అనే వార్తకు సంబంధించి రాసిన లీడ్‌. ఇది నమస్తే తెలంగాణ తనకు తాను రాసుకున్నట్టు ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. స్వరాష్ట్రంలో ఎనిమిదేళ్లల్లో ఒక్క రూపాయి ఇవ్వకపోగా, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని అ పత్రిక సన్నాయి నొక్కలు నొక్కిందని పలువురు భద్రాద్రి భక్తులు నొక్కి వక్కాణిస్తున్నారు. కేసీఆర్‌ వెనుకేసుకొస్తూ అసలు విషయాలకు పాతర వేసిన నమస్తే తెలంగాణ.. చివరకు రాముడికి కూడా సర్వ అబద్ధాలు చెప్పిందంటున్నారు. వంద కోట్లు ఇస్తామని. ఇవ్వలేదు. కరకట్టను అభివృద్ధి చేస్తామని చేయలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాముడికి పంగ నామాలు పెట్టింది భారత రాష్ట్ర సమితి సర్కారు అన్న ఆవేదన భద్రాద్రి భక్తుల్లో వ్యక్తమవుతోంది..

లక్ష ఇద్దామంటే ఎవరు అడ్డుకున్నారు?

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ కుటుంబ సమేతంగా భద్రాచలం వచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ పట్టు వస్త్రాల వెల రూ. 15,000. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మరుగున పెట్టి ఉమ్మడి రాష్ట్ర పాలకుల పాపం అంటూ తనకు అలవాటయిన పల్లవిని నమస్తే తెలంగాణ పాడిందని పలువురు గుర్తు చేస్తున్నారు. ఆ పత్రిక చెప్పినట్టే ఉమ్మడి పాలకులు అన్యాయం చేశారు అనుకుందాం. మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఏం చేసినట్టు? అని ఇక్కడి భక్తులు ప్రశ్నిస్తున్నారు. రాముడికి ఏం ఒరగపెట్టినట్టు? అని నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆ పత్రిక దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నారు. అంతే కాదు రామయ్య పట్టు వస్త్రాలకు రూ. 15 వేలు సరిపోవని దేవాదాయ శాఖ కమిషనర్‌ రూ. లక్ష ఇవ్వాలని ప్రతిపాదించారట! దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారట! కానీ కరోనా వల్ల వరుసగా రెండు ఏళ్లు అంతర్గతంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు కాబట్టి ఇవ్వలేదట! ఆ పత్రిక ప్రకారం అంతర్గతంగా వేడుకలు నిర్వహించినా రాష్ట్రప్రభుత్వం తరుఫున పట్టు వస్త్రాలు ఇవ్వాలి కదా! మరి దాన్ని ఎందుకు ప్రభుత్వం మరిచిపోయినట్టు? ఏ ఉమ్మడి పాలకులు ఒత్తిడి తెచ్చినట్టు? అని భద్రాద్రి భక్తులు పాత విషయాలను లేవనెత్తి మరీ కడిగేస్తున్నారు.

ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు

‘ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు రామాలయానికి నిధులు విడుదల చేయలేని ప్రభుత్వం.. రామనారాయణుడి వివాదం తీసుకొచ్చింది ఉమ్మడి పాలకులే అనడం హాస్యాస్పదం. అసలు రామ నారయణుడి వివాదం వైదిక పరమైన అంశం. అసలు వంద కోట్లకు, రామ నారాయణుడి వివాదానికి ఏంటి సంబంధం? నమస్తే చెప్పినట్టు దేవస్థానం వద్ద ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కనుక ఉంటే విరాళాలు ఎందుకు సేకరిస్తున్నట్టు? ఒక వేళ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉత్సవాలకు ఖర్చు చేస్తారా? అసలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇష్టానుసారంగా వాడుకునే అధికారం దేవస్థానానికి ఎందుకు ఉంటుంది? భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా బ్యాంకుల్లో వేస్తారు. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వాడుకునేందుకు అవకాశం ఉండదు. పోనీ భద్రాచలం అంతగా ఆదాయంతో అలరారుతున్నప్పుడు కేసీఆర్‌ వంద కోట్లు ఇస్తామని ప్రకటన ఎందుకు చేసినట్టు? దాని కోసం ఇన్నేళ్లుగా కాలయాపన ఎందుకు చేసినట్టు?’ అని ఇక్కడి భక్తులు నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది.

జీతాలు, ప్రొవిజినల్‌ చెల్లింపులకు భక్తుల నుంచి వచ్చే ఆదాయమే దిక్కు కాదా?

భద్రాద్రి దేవస్థానంలో రెగ్యులర్‌, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సిబ్బందికి జీతాల చెల్లింపులు, ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకుల కొనుగోలుకు భక్తుల నుంచి వచ్చే ఆదాయమే శరణ్యం. ప్రతి నెల జీతాలు, పెన్షన్ల రూపేణా ఉద్యోగులు, పెన్షనర్లు, సిబ్బందికి రూ.120 కోట్లు చెల్లిస్తున్నారు. కొన్ని సమయాల్లో ఈ జీతాల చెల్లింపులకు సరిపడా నిధులు లేకపోతే రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సైతం హుండీలు తెరిచే వరకు ఆగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ప్రసాదాల సరుకుల అమ్మకందారులకు, దేవస్థానంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిర్ణీత సమయంలో బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. అంతెందుకు 2020 సమయంలో దేవస్థానంలో పని చేస్తున్న సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ కమీషనర్‌ అనిల్‌కుమార్‌ ఆమోద ముద్రతో జీతాల కోసం జనరల్‌ ఫండ్‌లోని రూ. ఆరు కోట్ల ఫిక్సిడ్‌ డిపాజిట్లను ఉపసంహరించి ఉద్యోగులు, సిబ్బంది జీతాలు, వేతనాలు ఇతర చెల్లింపులను చేసింది వాస్తవం కాదా!

ఎన్నేళ్లు పడుతుంది?

రామాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పే ప్రభుత్వం.. ఇంత వరకూ ఎందుకు అభివృద్ధి పనులు చేయలేకపోయిందని భక్తులు నిలదీస్తున్నారు. ఇంకా ఎన్నేళ్లు పడుతుందని అంటున్నారు.. అంతటి కరోనా సమయంలో ప్రభుత్వం ఉన్న సచివాలయాన్ని పడగొట్టింది. మూడో కంటికి తెలియకుండా కూల్చేసింది. మీడియా ను రానియకుండా రాత్రికిరాత్రే మాయం చేసింది. రెండేళ్లు పూర్తి కాకముందే సచివాలయాన్ని దాదాపు పూర్తి చేసింది. మరీ ఈ లెక్కన రామాలయ అభివృద్ధికి రూ. వంద కోట్లు మంజూరు చేస్తున్నట్టు 2016లో ప్రకటించారు. కానీ ఇంత వరకూ రూపాయి ఇవ్వలేదు. ఇక రామాలయ అభివృద్ధికి ఆ మధ్య నమూనాలు విడుదల చేశారు. ఆనంద్‌ సాయి అర్కిటెక్ట్‌గా నియమించామని, చిన జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఒక నమూనా చిత్రం విడుదల చేశారు. తర్వాత ఏమైందో తెలియదు గానీ అది చప్పున చల్లారిపోయింది. ఇది ఎన్నేళ్లు పడుతుందంటూ భద్రాద్రి భక్తులు నిలదీస్తున్నారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ పత్రికకు సోషల్ మీడియాలో గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular