Homeక్రీడలుT20 World Cup IND vs ENG : అయిపోయే.. టీమిండియా ఫైనల్ కు చేరపాయే..

T20 World Cup IND vs ENG : అయిపోయే.. టీమిండియా ఫైనల్ కు చేరపాయే..

T20 World Cup IND vs ENG : అయిపోయే.. అంతా అయిపాయే.. టీ20 వరల్డ్ కప్ కు ముందర ఓ ప్రకటన అందరినీ ఆశల పల్లకీలో ఊరేగించింది. ‘‘2007లో ధోని సారథ్యంలో గెలిచిన టీమిండియా ఓ బస్ పై విజయయాత్రను చేసింది. అదే బస్ ను తిరిగి క్రికెట్ ఫ్యాన్స్ అంతా కడగడం.. విరాట్ కోహ్లీ పాడుబడ్డ బస్సును తిరిగి స్ట్రాట్ చేయడం.. టీమిండియా ఈసారి కప్ కొట్టి విజయయాత్ర చేస్తుందన్న భరోసాను అందరిలోనూ కల్పించారు.’ కానీ కట్ చేస్తే మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ దయవల్ల గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఒక్కో మెట్టు విజయంతో సెమీస్ కు చేరువైంది.

కానీ సెమీస్ లోనే మనోళ్లు తేలిపోయారు. బలమైన ఇంగ్లండ్ దెబ్బకు కుయ్యో మొర్రో అంటూ చిత్తుగా ఓడిపోయారు. ఎంత చిత్తుగా అంటే.. టీమిండియా నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు ఇద్దరూ కలిసే 16 ఓవర్లలోనే ఛేదించారు. ఇంగ్లండ్ బౌలింగ్ ను ఆడడానికి ఇండియా బ్యాట్స్ మెన్ తడబడ్డ ఇదే మైదానంలో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ చెడుగుడు ఆడేశారు. కెప్టెన్ జోస్ బట్లర్ 80, అలేక్స్ హేల్స్ 86 పరుగులతో చిత్తక్కొట్టి ఇంగ్లండ్ కూ ఊహించని అద్వితీయ విజయాన్ని అందించారు.

సెమీస్ లో ఘోర వైఫల్యం ఏదైనా ఉందంటే అది మన బౌలింగ్ డిపార్ట్ మెంట్ నే. ఒక్క వికెట్ కూడా తీయలేని దారుణ బౌలింగ్ ప్రదర్శనను మన బౌలర్లు చేశారు. ఎవ్వరూ కూడా కనీసం పోటీనివ్వలేకుండా బౌల్ చేశారు. ఇదే మన ఓటమికి కారణమైంది.

ఇప్పటిదాకా హీరోల్లా కనపడ్డ మన బౌలర్లు భువనేశ్వర్, అర్షదీప్ సైతం తేలిపోయి భారీగా పరుగులు ఇచ్చారు. షమీ అనుభవం సరిపోలేదు. అశ్విన్ మ్యాజిక్ పనిచేయలేదు. హార్ధిక్ బ్యాటింగ్ లో దంచికొట్టినా బౌలింగ్ లో తేలిపోయారు. అక్షర్ ఎడమచేతి వాటం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. మొత్తంగా ఆరుగురు టీమిండియా బౌలర్లు విఫలమైన వేళ టీమిండియా దారుణంగా ఓడిపోయింది.

నిజానికి మ్యాచ్ కు ముందు ఇంగ్లండ్ ను ఓడించి ఫైనల్ లో పాకిస్తాన్ ను డీకొట్టేది టీమిండియానే అని.. మన బ్యాటింగ్ సామర్థ్యం గురించి అందరూ గొప్పగా చెప్పారు. కానీ అదే బ్యాటింగ్ వీరులు అంతా తేలిపోయారు. కెప్టెన్ రోహిత్ నుంచి కేఎల్ రాహుల్ , పంత్, మిస్టర్ 360 సూర్యకుమార్ వరకూ అందరూ ఫ్లాప్ అయ్యారు. కేవలం కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మాత్రమే చెరో ఆఫ్ సెంచరీ చేయబట్టి ఆ మాత్రం స్కోరు అయినా సాధించింది. మొదటి పవర్ ప్లేలో కనీసం 35 పరుగులు కూడా చేయలేని టీమిండియా ఓపెనర్లు అక్కడే ఓటమికి పునాది పడింది. ఆ తర్వాత జోరందుకోలేదు. వెరసి ఫైనల్ కు వెళ్లాలి.. ఫైనల్ లో పాక్ ను కొట్టాలన్న సగటు భారతీయుడి కల చెదిరింది. మరో ఘోర ఓటమితో టీమిండియా టీ20 సెమీస్ లోనే వైదొలిగింది. ఇప్పటికైనా ఇలాంటి పసలేని జట్టును ప్రక్షాళన చేయాలని అందరూ కోరుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular