America
America: అగ్రరాజ్యం అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ(32) మృతిచెందాడు. రైతుకూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు గోపీకృష్ణ. బీటెక్ చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హెచ్–1బీ వీసాపై రావడంతో 11 నెలల క్రితం అమెరికా వెళ్లాడు.
సూపర్ మార్కెట్లో పనిచేస్తూ..
అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లోని ఓ సూపర్మార్కెట్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అమెరికా శుక్రవారం(జూన్ 21న) రాత్రి ఓ దుండగుడు సూపర్ మార్కెట్కు వచ్చి గోపీకృష్ణపై గన్తో కాల్పులు జరిపాడు. షాప్లోని సామగ్రి తీసుకుని పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈమేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
రెండేళ్ల క్రితం వివాహం…
గోపీకృష్ణ మరణ వార్త అందంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితమే ప్రవల్లికతో వివాహం జరిపించారు. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. తమ కొడుకు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.