AgriGold Victims: దశాబ్ద కాలానికి పైగా అగ్రిగోల్డ్ బాధితులు లక్షలాదిమంది తమ డిపాజిట్ ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలు రేపింది. కానీ కేవలం స్వల్ప మొత్తంలో డిపాజిట్ లకే మోక్షం కల్పించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయి చెల్లింపులపై దృష్టి పెట్టింది. క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. నిరుపేద, మధ్యతరగతి డిపాజిటర్లకు పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేసింది క్యాబినెట్ సబ్ కమిటీ. ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికలు ఇచ్చింది. సెప్టెంబర్ 15లోగా డిపాజిట్ల చెల్లింపులకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ తో పాటు మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉంది.
* రంగంలోకి సిఐడి..
ఏపీ ప్రభుత్వం సిఐడి ని రంగంలోకి దించి చర్యలను వేగవంతం చేస్తోంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం తమ బంధువులు,, బినామీల పేరుతో మళ్లించిన ఆస్తులను చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుని జీవోలు జారీ చేయడం, డైరెక్టర్ల కుటుంబ సభ్యుల స్థిరాస్తులను తాత్కాలికంగా చేసే బాధ్యతను ఇప్పుడు సిఐడి చూస్తోంది. అగ్రిగోల్డ్ బాధితుల్లో ఎక్కువమంది నిరుపేదలే. భవిష్యత్తుపై ఆశలతో చాలామంది డిపాజిట్లు చేశారు. అటువంటి వారికి ముందుగా న్యాయం చేయాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. నిరుపేదలతో పాటు మధ్యతరగతి వారు కట్టిన డిపాజిట్లకు చెల్లింపులు చేయాలని చూస్తోంది. సెప్టెంబర్ 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉంది కూటమి ప్రభుత్వం. అదే జరిగితే లక్షలాదిమంది నిరుపేదలు, సామాన్యులకు సంక్షేమ పథకం అందించినట్టే అవుతుంది.
* వైసిపి అడ్డుకునే ప్రయత్నం..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియను ఎలాగైనా అడ్డుకుంటుంది అనేది బహిరంగ రహస్యం. ఎందుకంటే బాధితులకు చెల్లింపులు ఎంత జాప్యం జరిగితే దానిని అంతగా రాజకీయం చేయవచ్చు కాబట్టి. కోర్టులో నడుస్తున్న పిటిషన్లను అడ్డం పెట్టుకుని ఈ రికవరీ ప్రక్రియను ఆలస్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఈ రకమైన కుట్రలను, న్యాయపరమైన అడ్డంకులను తిప్పి కొట్టడానికి ప్రభుత్వం ముందస్తుగా కెవియట్ పిటిషన్లు దాఖలు చేయడం, సిఐడి ద్వారా బలమైన ఆధారాలను న్యాయస్థానాల ముందు ఉంచడం అత్యంత కీలకం కూడా. బాధితులకు నిజమైన న్యాయం జరగాలంటే కేవలం ఆస్తుల జుట్టు ఆర్డర్లతో సరిపెట్టకుండా… ఒక నిర్దిష్టమైన కాల పరిమితులు ఆస్తుల వేలం ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
* త్వరితగతిన ఇవి చేయాలి..
సెప్టెంబర్ 15లోగా చెల్లింపులు చేయాలంటే త్వరితగతిన చాలా పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 15 కల్లా ప్రత్యేక కోర్టు పనితీరులోకి వచ్చేలా మంత్రివర్గ ఉప సంఘం ద్వారా ప్రణాళికలు సిద్ధం చేయడం సానుకూల పరిణామం. జప్తు చేసిన ఆస్తులకు సంబంధించి ఎలాంటి లీగల్ చిక్కులు లేకుండా స్పెషల్ కోర్టు ద్వారా త్వరితగతిన క్లియరెన్స్ తెచ్చుకొని.. వేలం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని నేరుగా అర్హులైన బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినప్పుడే ప్రభుత్వం పట్ల సామాన్యులతో పాటు మధ్యతరగతి వారికి నమ్మకం కుదురుతుంది. అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది గత ప్రభుత్వాల పట్ల. ఆ జాబితాలో కూటమి ప్రభుత్వం చేరకుండా ఉండాలి అంటే మాత్రం పటిష్ట చర్యలు చేపట్టాల్సిందే.