ఇప్పటివరకు వైవిధ్యభరితమైన భారత దేశంలో మతాలూ, మత ఘర్షణలు ఎలా పరిణతిచెందాయో దానివలన దేశం ఏ విధంగా నష్ట పోయిందో చూసాము. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సి వుంది. భారత భూమి ప్రపంచంలో ఎన్నో మతాల పుట్టుకకు కూడా పుట్టినిల్లు. సనాతన వైదిక మతం దగ్గర్నుంచి ఆధునిక యుగం లో ఉద్భవించిన సిక్కు మతం దాకా అన్నింటినీ ఆదరించిన పుణ్య భూమి మనది. ప్రపంచ చరిత్రలో జరూసలెం కు వచ్చినపేరు భరత భూమికి రాలేదు. ఎందుకంటే చరిత్ర అంతా ఎవరి ఆధిపత్యంలో వుంటే వారి పక్షానే వుంటుంది. ఎక్కడిదాకా ఎందుకు ఆధునిక చరిత్రలో అత్యంత మానవ విషాద సంఘటనల్లో బ్రిటిష్ బహుమానంగా ఇచ్చిన భారత విభజన ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మానవ తప్పిదంతో జరిగిన మానవ వినాశనం గా చెప్పొచ్చు. అయినా చరిత్రలో దానికి సరయిన ప్రాధాన్యం లేదు. ఇన్ని లక్షల మంది విషాదానికి కారణమైన బ్రిటిష్ ని నేరస్థుల బోనులో ముద్దాయిగా నిలబెట్టి శిక్షించాల్సింది. విభజన చేయాలనుకుంటే అన్ని రకాలా సంసిద్ధం చేసి ప్రాణ నష్టం జరక్కుండా చేయకుండా హడావిడిగా తేదీని ముందుకు జరిపి ఎప్పుడూ భారత్ ని సందర్శించని, భారత్ గురించి ఏమీ తెలియని ఒక సర్వేయర్ కి అప్పగించి గదిలో మ్యాపుల పై గీతలు గీసి చేసిన ‘ ఘనకార్యం’ క్షమించరాని నేరం. ఆ రావణా కాష్టం ఇంకా రగులుతూనే వుంది. ఎప్పటికైనా ఇంతటి మానవాళి వినాశనానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వాన్ని నేర ముద్దాయిగా ప్రకటిస్తారని ఆశిద్దాం.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ఇన్ని మతాల పుట్టుకకు నిలయమైన భారత్ కు రావాల్సిన ఖ్యాతి రాలేదు. హిందూ మతం భారత ఉపఖండంతో పాటు ఆగ్నేయ ఆసియాలో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందటం తెలిసిందే. ఇటీవలే వియత్నాంలో శివలింగం బయటపడటం అన్ని పత్రికల్లో చూసాము. ఇండోనేషియా, కంబోడియా ల్లోని హిందూ దేవాలయాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యాత్రికుల్ని అలరిస్తున్నాయి. ఇక బౌద్ధమత వ్యాప్తి గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకనాడు మొత్తం ఆసియా లో విస్తరించిన ఏకైక మతం బౌద్ధం. ఈ రోజుకీ చైనా, తూర్పు,ఆగ్నేయ ఆసియాల్లో వ్యాపించివున్న మతం బౌద్ధం. జైన మతం అత్యంత ప్రాచీన మతాలలో. ఒకటి. అలాగే భౌతిక వాదానికి కూడా పుట్టినిల్లు మన గడ్డనే. ఇన్ని విభిన్న ఆలోచనలను, విశ్వాసాలను అక్కున చేర్చుకొని ఆదరించిన భూమి మనది. అటువంటిది ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్ళను కూడా పరిష్కరించగల సత్తా మన భూమికి, మన ప్రజలకి వుంది. ఆ విషయం మరిచిపోవద్దు. మత విశ్వాసాలు మనుగడ సాగించటం కష్టమనుకున్నప్పుడు మన గడ్డ మీదకు వచ్చి తలదాచుకున్న గొప్ప వారసత్వ సంపద మనది. పార్సీలు , బహాయి మతస్తులు పారిపోయి భారత్ లో ఆశ్రయం పొందిన సంగతి చెప్పాల్సిన పనిలేదు. అంతెందుకు అబ్రహాం మతాలైన యూదులు, క్రైస్తవులు, ముస్లిం లు ఎప్పట్నుంచో మన గడ్డ పై సహజీవనం చేస్తున్న సంగతిని కూడా గుర్తు పెట్టుకుందాం. 8 వ శతాబ్దంలో పశ్చిమ సరిహద్దుల్లో నుంచి వచ్చిన ఇస్లాం, 15 వ శతాబ్దం నుంచి వచ్చిన యూరప్ క్రైస్తవం తోనే ఘర్షణ వాతావరణం పెరిగింది. స్వాతంత్రానంతరం ఆ వాతావరణాన్నుంచి బయటపడి మనిషిని మనిషిగా చూసే ఆధునిక భావాలకు ప్రతీకలుగా కలిసి మెలిసి బతకలేమా? మతం పేరుతో కొట్టుకు చావాల్సిందేనా? ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా గుండె మీద చేయివేసుకొని ఒక్క నిముషం ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. మనిషి పుట్టినప్పుడు మతం లేదు, మనిషి చచ్చిన తర్వాత మతాన్ని మోసుకొని వెళ్ళడు. వున్న కొన్నాళ్ళు నాగరికంగా బతకలేమా? అదే అమెరికా వెళ్లి ప్రశాంతంగా బతుకుతున్నప్పుడు ఇక్కడ మనం ఆ పని చేయలేమా? మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మన మనసుల్లోంచి తుప్పు వదిలించుకుంటే ఆరోగ్యకరమైన వాతావరణం లో బతకొచ్చు. ఎవరిమత విశ్వాసాలు వారు పాటిస్తూ హాయిగా బతకొచ్చు. ఒక్కసారి కాశ్మీర్ చరిత్ర చూడండి. ఇబ్బందులు తలెత్తినప్పుడు అందరూకలిసి కూర్చొని ఎలా బతకొచ్చో నేర్పారు. కలిసి మాట్లాడుకొని గో మాంసాన్ని , పంది మాంసాన్ని కాశ్మీర్ భోజనం నుంచి నిషేదించారు. మనిషి కలిసి వుండటం కన్నా ఇవి ముఖ్యంకాదని తీర్మానించారు. ఒకరి మత పండగలకి మరొకరు హాజరయ్యే వారు. ఈ మిశ్రమ సంస్కృతి నే ‘కాశ్మీరియత్’ అనేవారు. ఇది మన కళ్ళముందే 15 వ శతాబ్దం లో జరిగింది. అటువంటి మంచి సంస్కృతిని పోగొట్టుకొని విభేదాలతో , కక్షలతో బతికి సాధించేదేమిటి? ఇప్పటికైనా ఆ స్పూర్తితో కలిసి మెలిసి ఉందాం, అన్ని మత విశ్వాసాలను కొంతమేర సడలించుకొని భారతీయ ప్రత్యేకతో ఆదర్శ మానవ సంబధాలను కొనసాగిద్దాం.
రాజకీయ పార్టీల పాత్ర
దురదృష్టవశాత్తు భారత రాజకీయపటం లో మత సామరస్యం కోసం రాజకీయ పార్టీలు కృషి చేసిన దానికన్నా సామరస్య వాతావరణాన్ని చెడగొట్టిందే ఎక్కువ. ఒకవైపు ప్రభుత్వం మతాలతో సంబంధం లేకుండా అందరికోసం పనిచేస్తుందని చెబుతూనే ఆచరణలో విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలుచేశారు. సెక్యులర్ నినాదాలిస్తూనే రెండోవైపు ఓటు రాజకీయాలు చేసారు. నిజంగా సెక్యులరిజాన్ని తూచా తప్పకుండా పాటించి వుంటే ప్రజలు మతపరంగా విభజనకు గురయ్యేవారు కారు. సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా పరిష్కరించకుండా ప్రతిదానిని ఓటు రాజకీయాలతో చూడటంతో క్రమ క్రమేణా ప్రజలు కూడా ఆ వాతావరణానికి అలవాటుపడ్డారు. ఉదాహరణకు మత ఘర్షణలు జరిగినప్పుడు ముద్దాయిలు ఏ మతస్తులని చూడకుండా న్యాయం చేయగలగాలి. అంతేగాని ఒకవైపు కొమ్ముకాయటం చేయకూడదు. నేరం నేరమే . ఇది రాజకీయ పార్టీల్లో లోపించింది. అందుకే విభజనకు బ్రిటిష్ వాడు ఎలా ముద్దాయో మత విభజన కొనసాగటానికి రాజకీయ పార్టీలు ముద్దాయిలు.
ఇది నిజంగా దురదృష్టం. అదే యూరప్ లో, అమెరికాలో చూడండి. రాజకీయ పార్టీలు మితవాద, అతివాద, మధ్యేవాద పార్టీలుగా విడిపోయి వుండొచ్చు. కానీ సమాజాన్ని మతం పేరుతో విడదీయ లేదు. అది సమాజానికి రాజకీయపార్టీలు చేసిన మేలు. ఉదాహరణకు జర్మన్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు ఏంజెలా మెర్కెల్ సంప్రదాయ, మితవాద పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అయినా సిరియా శరణార్ధుల విషయంలో అందరికన్నా ఔదార్యంగా వ్యవహరించింది. ఆ కాంట్రిబ్యూషన్ భారతీయ పార్టీలు చేయలేదు. ఎక్కువకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడే ఒరవడే సంప్రదాయంగా కొనసాగుతుంది. ఈరోజు బిజెపి అధికారం లోకి వచ్చిందంటే అది మెజారిటీ హిందువులు కాంగ్రెస్ బుజ్జగింపు , వివక్ష రాజకీయాలు విసుగు చెంది సమీకరించబడ్డారు. బిజెపి ప్రధానంగా హిందువుల మద్దత్తు తోనే అధికారం లోకి వచ్చిందనేది బహిరంగ రహస్యం. దాని పూర్వ పార్టీ అయిన భారతీయ జన సంఘ్ ని ఆదరించని ప్రజలు ఇప్పుడే ఎందుకు ఆదరించారో కాంగ్రెస్ , మిగతా ‘సెక్యులర్’ పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనదేశంలో సెక్యులరిజమంటే హిందూ మత వ్యతిరేక వైఖరిగా మారిపోయింది.ఇప్పటికైనా నిజమైన సెక్యులర్ విధానాలు అవలంబిస్తే ప్రజలు మతాన్ని పక్కన బెట్టి ప్రజా సమస్యల పై సమీకరించబడతారు. .అందుకే ఇంతటి ‘ఘన చరిత్ర గలిగిన ఈ సెక్యులర్ పార్టీలు’ మత సామరస్యాన్ని సాధించలేకపోయారు.
మరి సమస్యను ఎలా పరిష్కరించాలి?
ముందుగా వివాదాస్పద అంశాలను మూడుగా వర్గీకరించాలి . ఇప్పటికే కోర్టుల్లో విచారణలో వున్న అంశాలు, ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోదగ్గ అంశాలు, చివరగా విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అంశాలుగా విభజించుకుందాం. అవేమిటో ఒక్కసారి చూద్దాం.
కోర్టులో విచారణలో వున్న అంశాలు
సుప్రీం కోర్టు స్థాయిలో విచారణలో ఇప్పటికే ఇస్లాం పౌర స్మృతికి చెందిన బహుభార్యత్వం , నిఖా హలాలా అంశాలు వున్నాయి. అలాగే హిందూ దేవాలయాల ప్రభుత్వ నియంత్రణ పై కూడా సుప్రీం కోర్టు లో కేసు విచారణలో వుంది.
ప్రభుత్వం తీసుకోదగ్గ నిర్ణయాలు
గోవధ పేరుతో హత్యలు, సామూహిక హత్యల ( mob lynching) పై మరింత కఠిన చట్టాలు చేయటం పై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలుచేయవచ్చు. హేతువాదుల హత్యల విషయం లో కూడా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దోషులను పట్టుకొని శిక్షించవచ్చు. పూజారుల, ఇమాంల, పాస్టర్ల వేతనాలు; మత తీర్ధ యాత్రల ఖర్చులు; దేవాలయాలు , మసీదులు, చర్చీల నిర్మాణాలకు, మరమత్తులకు ఖర్చులు ఇత్యాది అంశాలపై ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవచ్చు. జనాభా నియంత్రణ అంశంపై కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటానికి అడ్డంకి లేదు. వీటన్నింటిపై ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తే సరిపోతుంది. ఇది ప్రాధమికంగా ప్రభుత్వ పరిధిలోని అంశాలే.
విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అంశాలు
వుమ్మడి పౌర స్మృతి; మత మార్పిడులు; మత ప్రార్ధనలు , మత పండుగలు, కార్యక్రమాల పేరుతో లౌడ్ స్పీకర్ల వినియోగం; విద్యా సంస్థల నియంత్రణ పై వుమ్మడి విధానం; మైనారిటీ నిర్వచనం పై పునఃసమీక్ష ; దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు; ఇస్లాం పౌర స్మృతి లో సంస్కరణలు; పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌరసత్వ పట్టిక లాంటి అంశాలు సున్నితమైన అంశాలు. వీటిపై అందరి హక్కుదారులతో విస్తృత చర్చలు జరపాలి. పై రెండింటిని కోర్టులకు, ప్రభుత్వాలకు వదిలిపెడితే ఈ అంశాలపై ఓ అవగాహనకు రావాల్సిన అవసరం వుంది.
విస్తృత అవగాహనకు కావల్సిన భూమిక
అన్నింటికన్నా ముందుగా కావాల్సింది ప్రభుత్వం లో నాయకత్వం వహించే వారికి వీటిని పరిష్కరించాలనే చిత్తశుద్ధి , నిజాయితీ . అది లేకుండా ఓటు బ్యాంకు రాజకీయాలతో చూసేటట్లయితే ఇవి ఎప్పటికీ పరిష్కారం కావు. రెండోది, హిందువులు, ముస్లింల ప్రతినిధులలో తాము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు చందంలా కాకుండా పట్టువిడుపులు వుండటం. మూడోది , జాతీయ దృక్పధంతో , జాతిహితాన్ని దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయాలు తీసుకోగలగటం, వాటిని అమలు చేయగలగటం.
మోడీ 2019 లో తిరిగి ఎన్నికయ్యాడు. ఇప్పటికి ఒక సంవత్సరం గడిచింది. ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వమే వుంటుంది. కాబట్టి సమయం సరిపోతుంది. రెండోది , నాయకత్వానికి చిత్తశుద్ది, నిజాయితీ, దృఢ నిర్ణయాలు తీసుకోగల శక్తి . వీటిల్లో మోడీకి నూటికి నూరు మార్కులు వేయొచ్చు. కాబట్టి కావాల్సిన అర్హతలు సరిపోతున్నాయి. నాలుగు సంవత్సరాలు సమయం వుండటం , గట్టి నిర్ణయాలు చిత్తశుద్ధితో తీసుకునే నాయకత్వం వుండటం తో 72 సంవత్సరాల నుండి పేరుకుపోయిన ఈ చిక్కుముడిని విప్పటానికి ఇంతకన్నా మంచి అవకాశం వుండదు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ముస్లింలలో మోడీ పై అనుమానాలుండటం. ఇది చిన్న విషయమేమీ కాదు. దీనికి ప్రభుత్వ పెద్దగా మోడీనే చొరవ తీసుకొని ముస్లిం వర్గాల్లో సానుకూల వాతావరణం ఏర్పడే చర్యలు చేపట్టాలి. అంటే పాత ప్రభుత్వాల లాగా బుజ్జగింపు చర్యలో, సంతుష్టీకరణ చర్యలో చేయమని కాదు. తను ముస్లింలకి వ్యతిరేకం కాదనేది మరింత ప్రజా సంబంధాల ద్వారా , విస్తృత సంప్రదింపుల ద్వారా తెలియజేసే కార్యక్రమం చేపట్టాలి. ఉదాహరణకు ముమ్మూరు తలాక్ ని రద్దుచేయటం, మహిళలు ఒంటరిగా హజ్ యాత్రకు వెళ్ళే సదుపాయం కల్పించటం , మదరసాలలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టటం లాంటి ముస్లిం అనుకూల నిర్ణయాలు తీసుకున్నా మత చాందసుల ప్రచారం తో ముస్లిం వ్యతిరేకిగా ముద్రపడ్డాడు. తను తీసుకున్న సంక్షేమ పధకాలు కూడా అత్యంత పేదరికంలో మగ్గుతున్న పేద ముస్లిం ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. తన ఆరు సంవత్సరాల పరిపాలనలో ముస్లిం వ్యతిరేక చర్య ఒక్కటి కూడా చేపట్టిన దాఖలాలు లేవు. అందరినీ కలుపుకెల్లే ప్రయత్నమే చేశాడు. లేనిపోని ఆరోపణలతో మత ఛందస వాదులు , మోడీ బద్ద వ్యతిరేకులు ప్రచారమే ఎక్కువగా జరిగింది. గో పరిరక్షణ పేరుతోనో, పుకార్ల మీద ఆధారపడి జరిగే mob lynching పైనో ఆధారపడి మోడీని ఇరికించటం ఎంతవరకు సబబు? ఇవి ఉత్తరాది లో ఎప్పటినుంచో వస్తున్న సామాజిక ఉద్రిక్తతలు. ఇటీవల జరిగిన డిల్లీ అల్లర్లలో ఇటు హిందువులు, అటు ముస్లిం లు అందరిపై కేసులు పెట్టటం హర్షించదగ్గ పరిణామం. ఎవరు తప్పుచేసినా చట్టం ముందు అందరూ సమానమేనని ఆచరణలో నిరూపించినప్పుడే ప్రజలు హర్షిస్తారు.
మోడీలో కొన్ని లోపాలున్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించకపోవటం. దానివలన అవతలివారు బురద చల్లే అవకాశాలు కల్పించినట్లవుతుంది. ఒక్క గో పరిరక్షణ వాదుల పేరుతో జరిగే హింస విషయం లోనే కాదు , హిందువుల కు సంబంధించి పాల్ఘార్ స్వామీజీ హత్య సమయంలో కూడా స్పందించలేదు. అయితే రెండోది హిందువులకు సంబంధించినది కావటం తో ఉదారవాదులు మోడీ పై బురదచల్లలేదు. ఈ సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వ శాంతి భద్రతలకు సంబంధించినవయినా అపోహలు తలెత్తినప్పుడు స్పందిస్తే ప్రధానమంత్రి హామీ ఇచ్చాడనే సంతృప్తి ముస్లిం ప్రజల్లో వుంటుంది. ఇటువంటి చిన్న చిన్న చర్యలే విశ్వాసం పెరగటానికైనా, పోవటానికైనా కారణమవుతుంటాయి. రెండోది, రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చే నాయకుల్ని కట్టడి చేయకపోవటం. అధికారం లో వున్నప్పుడు అందరినీ కలుపుకుపోయే చర్యలతో పాటు, కలుపుకుపోతున్నామనే భావన కూడా కల్పించాల్సిన అవసరం వుంది. ఇటువంటి ప్రకటనలు ఇచ్చే నాయకుల్ని హెచ్చరించటం, ఒకరిద్దరి పై క్రమశిక్షణా చర్యలు తీసుకొనివుంటే సామాన్య ముస్లిం ప్రజానీకంలో ఒక నమ్మకం ఏర్పడేది. ఈరోజు మనదేశానికే కాదు ప్రపంచ నాయకుల్లో ఒకడుగా మోడీ గుర్తింపు పొందాడు. ముస్లిం దేశాలతో కూడా తన హయాం లో సంబంధాలు మెరుగుపరిచిన ఘనత మోడీది. చాలామంది ముస్లిం పాలకులతో వ్యక్తిగత సంబంధాలు వున్నాయి. ఇంతటి గుడ్ విల్ సంపాదించినప్పుడు దేశంలోని ముస్లిం ప్రజానీకంలో కూడా గుడ్ విల్ సంపాదించుకొని వుండాల్సింది. ఆ విషయం లో వెనకబడి పోవటానికి కొన్ని చర్యలు తీసుకొనివున్నట్లయితే ఇంత అపనమ్మకం వచ్చేది కాదు. ఛాందస వాదులు ఎప్పుడూ మద్దత్తివ్వరు. కానీ సామాన్య ప్రజానీకంలో గుడ్ విల్ వచ్చివుండేది. ఇప్పటికైనా సమయం మించి పోయిందేమీలేదు. తన ప్రవర్తనతో , ప్రజా సంబంధాలు మెరుగు పరచుకోవటంతో ఈ గుడ్ విల్ ని పొందవచ్చు. మిగతా రాజకీయనాయకులు ముస్లిం ప్రజానీకానికి పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు, ఈయన ఒరగపెట్టందేమీ లేదు. ఒకవిధంగా ముస్లిం మహిళలకు ఈయన హయాంలోనే కొంతయినా న్యాయం జరిగింది. తేడా అల్లా ప్రజా సంబంధలలోనే. ఆ విషయంలో మోడీ ప్రవర్తనలో మార్పు రావాలి. సున్నితమైన అంశాలపై తన అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు వ్యక్తపరిచినప్పుడే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వుంటుంది.
హిందువులు దేశంలో 75 శాతం జనాభాతో పూర్తి మెజారిటీలో వున్నారు. అటువంటప్పుడు వారిమీద మరింత బాధ్యత వుంది. అందరినీ కలుపు కెల్ల గలిగితే సమాజం మొత్తం ప్రశాంతంగా వుంటుంది. ఇంతకుముందు హిందువులపై వివక్ష చూపింఛి , మిగతా మతస్తులకు పెద్దపీట వేసారనే భావం వుండటంతో అలా ప్రవర్తించారనుకున్నా ప్రస్తుతం అలా వివక్ష చూపించే ఆస్కారం లేనప్పుడు రెచ్చగొట్టే ప్రకటనలతో సాధించేదేమిటో తెలియదు. వివాదాస్పద అంశాలుంటే సావధానంగా వినే ప్రభుత్వముంది, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనే వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత మెజారిటీ వర్గంపై అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మైనారిటీలను కలుపుకొని వెళ్ళకుండా దేశం ఎలా పురోగతి చెందుతుందో ఒక్కసారి మెజారిటీ వర్గం ఆలోచించుకోవాలి. ప్రాచీనకాలం నుంచి హిందూ సమాజం అందరినీ , అన్ని భావాలను ఆదరించిందని చెప్పటమే కాదు ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగించాల్సిన అవసరం వుంది.
ముస్లిం ప్రజానీకం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. వెయ్యి సంవత్సరాలు ఈ దేశం లో పాలకులుగా వున్నారు. అయినా మెజారిటీ ప్రజానీకం ఇప్పటికీ హిందువులుగానే వున్నారు. అది ఈదేశ ప్రత్యేక పరిస్థితి. ఈరోజు 15 శాతం జనాభా తో వున్న దేశంలో ఇస్లాం రాజ్యం స్థాపించాలనే వాదనలను,వాదులను దూరం పెట్టాల్సిన అవసరం వుంది. ఉదాహరణకు జాకీర్ నాయక్ లాంటి వారు కొన్ని దశాబ్దాలు ఇస్లాం రాజ్యం స్థాపించాలని ప్రచారం చేస్తే ఎంతమంది ముస్లిం మేధావులు ఈ వాదనను ఖండించారు? ఇప్పుడుకూడా మత చాందస వాదులు ఇస్లాం రాజ్యమని , షరియత్ చట్టాన్ని అమలుచేస్తామని మాట్లాడుతుంటే ఎంతమంది ఖండించారు? ఈ వాదనలు భారత్ లో ఆచరణ సాధ్యం కాదని, మెజారిటీ మతస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వున్నాయని గ్రహించి ఇటువంటివారిని దూరంపెట్టక పోతే నష్టపోయేది మైనారిటీ ప్రజలేకదా? ఆ విషయం మరిచిపోయి మత చాందస వాదుల భ్రమల్లో కొట్టుకుపోకూడదు కదా? 21వ శతాబ్దపు ఆలోచనలకు అనుగుణంగా ఇస్లాం సమాజం లో సంస్కరణలు రావాలని వుద్యమించాల్సింది పోయి ఈ చాందస వాదుల వెనకాల నడవటం తిరోగమన ఆలోచన కాదా? ఒక్కసారి ఆలోచించండి. అటు హిందువులు, ఇటు ముస్లింలు పట్టువిడుపులు విడనాడి కలిసి మెలిసి జీవనం సాగించాలంటే మొంకుపట్టు పట్టకుండా వుమ్మడి పౌర స్మృతి ని ఆమోదించటమే ఉత్తమం. అమెరికాలో, యూరప్ లో వుమ్మడి పౌర స్మృతి ని ఆమోదించి జీవనం సాగిస్తున్నప్పుడు భారత్ లో వచ్చిన అడ్డంకేమిటి? ఒక్కసారి ఆలోచించండి.
కార్యాచరణ ఎలా వుండాలి ?
ముందుగా ప్రభుత్వం విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ( అవేమిటో పైన వివరించాము) వెంటనే తీసుకోవాలి. భారత రాజ్యాంగ సెక్యులర్ స్ఫూర్తి కి అనుగుణంగా ఈ నిర్ణయాలు వుండాలి. మతాన్ని రాజ్యంతో విడదీసే విధంగా నిర్ణయాలు వుండాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.
తర్వాత వివాదాస్పద అంశాలపై విస్తృత సంప్రదింపులు జరపాలి . దానికి అవసరమయితే సమయం పట్టినా ఓపికతో వేచిచూడాలి. అయితే అదివరకు ప్రభుత్వాలలాగా సమస్యను శాశ్వతంగా వాయిదా వేసే పద్దతిలో వుండకూడదు. ఇప్పటికే 72 సంవత్సరాలు వృధా అయ్యింది. వచ్చే నాలుగు సంవత్సరాల లోపు ఈ వివాదాస్పద అంశాలకు పరిష్కారం కనుక్కొనే కాల పరిమితి పెట్టుకోవాలి. విస్తృత సంప్రదింపుల్లో అన్నిరకాల అభిప్రాయాలు వ్యక్తపరిచే వాతావరణం కలిగించాలి. అన్ని మతస్తుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి, హేతువాదుల అభిప్రాయాలతో సహా . ఒకసారి కాకుండా వారందరితో అనేక పర్యాయాలు సంప్రదింపులు కొనసాగించాలి. సాధ్యమైనవరకు అందరినీ ఒప్పించటానికి ఓపికతో ప్రయత్నం చేయాలి. అందుకు అన్నిరకాల మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలి.
ప్రభుత్వం సర్వ సమ్మతితో నడుస్తుందనే భావన కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై , ముఖ్యంగా మోడీపై వుంది. ఇది ఒక వర్గానికి వ్యతిరేకమనో, మరొక వర్గానికి అనుకూలమనో భావన రాకుండా నిస్పక్షపాతంగా విధాన నిర్ణయాలు తీసుకుంటుందనే భావన ప్రజల్లో వచ్చే విధంగా కార్యాచరణ వుండాలి. ఉదాహరణకు పౌరసత్వ సవరణ చట్టం పై కొంతమంది కిందిస్థాయి నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు , ఉపన్యాసాలు ఇవ్వటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అటువంటి సమయంలో అధికార పార్టీ నాయకత్వం స్పందించి వాటిని ఖండించి వుండాల్సింది. అలా చేయకపోవటం వలన నాయకత్వం కూడా పరోక్షంగా వారికి మద్దతిస్తుందనే భావన ముస్లిం ప్రజానీకం లో ఏర్పడటానికి దోహదపడింది. ఇకనైనా మోడీ ఈ విషయాల్లో దృష్టి పెట్టకపోతే సామాజిక ఐక్యతకు నష్టం జరుగుతుంది.
చివరగా ఈ విస్తృత సంప్రదింపుల ప్రక్రియ అనంతరం వీటన్నింటినీ సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవైపు విభిన్న వర్గాల అభిప్రాయాలకు విలువ ఇస్తూనే సెక్యులర్ స్పూర్తితో రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలి. దేశహితం, జాతీయ సమగ్రత , మనిషి ని మనిషిగా గౌరవించే సంబంధాల వృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు వుండాలి. ఏదో ఒక మతానికి అనుకూలంగానో కాకుండా మానవాభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈ నిర్ణయాలు వుండాలి. దీర్ఘకాలంలో మానవులందరూ మతాతీతంగా, లింగ సమానత్వం ప్రాతిపదికగా ఒకరినొకరు ప్రేమాభిమానాలతో కలిసి మెలిసి జీవించే విధంగా నిర్ణయాలు వుంటే భవిష్యత్తు తరాలు కలకాలం చరిత్రలో గుర్తుపెట్టుకుంటాయి. ఆ పని మోడీ చేయగలడని నమ్మకముంది. సమయమూ, అధికారమూ , అవకాశమూ తనకు అనుకూలంగా వున్నాయి. విశాల దృక్పధంతో ఈ ప్రక్రియను చేస్తాడని ఆశిద్దాము. గట్టి నాయకుడు, మెజారిటీతో నడిచే ప్రభుత్వం లేకుండా ఈ పని సాధ్యం కాదు. అందుకే అన్నీ అనుకూలంగా వున్న మోడీ ఈ పరిష్కారం చేసి ప్రజల మన్ననలు పొందుతాడని ఆశిద్దాం. నిర్ణయాలు దేశాహితాని దృష్టిలో పెట్టుకొని, అందరినీ కలుపుకెల్లే విధంగా ఉంటాయని ఆశిద్దాం. నిజమైన సెక్యులర్ సమాజం నిర్మాణం అవుతుందని అదే దేశాన్ని ప్రపంచం లో అగ్రగామిగా నిలబెడుతుందని ఆశిద్దాం.
72 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు పేరుతో విభజించబడటం చూసి ఆవేదనతో ఈ సమస్యను సమగ్రంగా, లోతుగా చర్చించి పరిష్కారమార్గాలు కనుక్కోవాలనే ఉద్దేశంతో చేసిన చిన్ని ప్రయత్నమే ఇది. హర్షిస్తారని ఆశిస్తూ సెలవు.
మీ రామ్