Religious Harmony: అన్ని మతాల సారం ఒక్కటే.. ఇది మతసామరస్యానికి ప్రతీకగా వస్తున్న నినాదం. మతం అనేది మనుషుల మధ్య ఐక్యత పెంచాలని తప్ప విభజన రేఖ గీయకూడదు. హిందూ ముస్లిం భాయి భాయి అనే మాట శతాబ్దాలుగా వినిపిస్తుందే కానీ.. ఆచరణ విషయానికి వచ్చేసరికి మాత్రం చేతికిల పడుతోంది. ఒక మతానికి సంబంధించిన సంప్రదాయాన్ని మరో మతం గౌరవిస్తుంటే.. ఆ మతం సంప్రదాయాన్ని ఇంకో మతం విస్మరిస్తోంది. ఒక ప్రాంతంలో ముస్లింల పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంకో ప్రాంతంలో హిందువుల పండుగల్లో ముస్లింలు పాల్గొంటున్నారు. అంతవరకు ఓకే కానీ.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మత జాడ్యం కొనసాగుతూనే ఉంది. అటువంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* దశాబ్దాల సెంటిమెంట్..
సాధారణంగా సాయిబులు అనే పిలిచే ముస్లింలు ఎటువంటి శత్రు పీడలు ఉండకుండా ఉండేందుకు షాపులు, వాణిజ్య సముదాయాలకు సాంబ్రాణి వేస్తుంటారు. అలా వేస్తే శత్రు పీడలు ఉండవని నమ్మకం. దర్గాతో పాటు ప్రార్థనా మందిరాల్లో పూజలు చేసి తెచ్చిన సాంబ్రాణిని ప్రతి షాపు వద్దకు వెళ్లి అందిస్తుంటారు. అయితే ఈ విషయంలో హిందువులకు ఎటువంటి అనుమానాలు, అపార్ధాలు ఉండవు కూడా. ఎందుకంటే ఇప్పటికీ శత్రు పీడలతోపాటు చేతబడి వంటి వాటికి సాయిబులు అనే పిలిచే ముస్లింలను ఆశ్రయిస్తుంటారు మతాలకు అతీతంగా. అయితే దీనిని ఒక మతపరమైన ఆచారంగా భావించకుండా.. కేవలం రోగ నియంత్రణ కోణంలోనే చూస్తారు. ఈ క్రమంలో సాయిబు అనే వ్యక్తి ముస్లిం అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. అంతలా కొనసాగుతుంది ఆ ఆచారం. ప్రజల్లో బలంగా నాటుకుంది కూడా.
* బొట్టు పెట్టుకోమని కోరగా..
ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా షాపు వద్ద ఓ సాయిబు సాంబ్రాణి వేస్తుండగా స్థానికులు గుర్తించారు. హిందూ మతానికి సంబంధించిన బొట్టును పెట్టుకోవాలని కోరారు. కానీ అందుకు ఆ సాయిబు అంగీకరించలేదు. పెట్టుకునేందుకు ఒప్పుకోలేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మతాన్ని మేము గౌరవించాం.. మా మతాన్ని మీరు గౌరవించరా అంటూ నిలదీసినంత పని చేశారు. ప్రతి షాపు వద్ద సాంబ్రాణి వేసి డబ్బులు లాక్కుంటున్నారని.. కానీ ఏనాడు అభ్యంతరం చెప్పలేదని.. హిందూ మతానికి చెందిన బొట్టు పెట్టుకోవడం లేదని.. కానీ హిందువులు మాత్రం దర్గాలో పూజ చేసిన సాంబ్రాణిని ఆహ్వానిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే ఆ సాయిబు బొట్టు పెట్టుకునేందుకు ఒప్పుకోలేదు. అయితే దీనిని హిందుత్వవాదులు వైరల్ చేస్తున్నారు. ఇదేనా మతసామరస్యం? హిందువులు ఇతర మతాలను కలుపుకు వెళ్తారు కానీ.. ఇతర మతాలవారు హిందువులను ద్వేషిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం చూసే కోణం బట్టి ఉంటుంది మతం. కానీ ఇప్పటికీ మనదేశంలో చాలా ప్రాంతాల్లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే పండుగలు జరుగుతున్నాయి. ఒక మతం వారి విశ్వాసాన్ని మరో మతం వారు గౌరవిస్తున్నారు. పరస్పరం గౌరవించుకుంటున్నారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని మసులుకోవాల్సిన అవసరం ఉంది.