Homeజాతీయం - అంతర్జాతీయంHormuz Strait reopening: హర్మూజ్‌ తెరుచుకుంది.. భారత్‌ ఊపిరి పీల్చుకుంది

Hormuz Strait reopening: హర్మూజ్‌ తెరుచుకుంది.. భారత్‌ ఊపిరి పీల్చుకుంది

Hormuz Strait reopening: దాదాపు 40 రోజులపాటు సాగిన ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ వార్‌కు ఎట్టకేలకు కాస్త బ్రేక్‌ పడంది. తప్పుడు అంచనాలతో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా, ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియక తలపట్టుకుంది. ఈ సమంయలోనే మధ్యవర్తిత్వం, చర్చల పేరుతో ఇరాన్‌ను బుజ్జగించే పని మొదలు పెట్టింది. ఒకవైపు ఇరాన్‌కు చుక్కలు చూపిస్తాం. ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం.. ఈ రాత్రి మీకు కాళరాత్రే అంటూ పైకి హెచ్చరిస్తూనే ట్రంప్‌ తెరవెనుక బుజ్జగింపులు మొదలు పెట్టాడు. ఎట్టకేలకు ఈ బుజ్జగింపులకు ఇరాన్‌ అంగీకరించింది. దీంతో ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరింది. మరోవైపు హర్మూజ్‌ తెరిచేందుకు ఇరాన్‌ అంగీకరించింది. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. ఇన్నిరోజులు హర్మూజ్‌ జలసంధి దిగ్బంధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో వెలువడిన ఈ నిర్ణయం గ్లోబల్‌ మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది.

ఒప్పందం ముఖ్యాంశాలు..
సీజ్‌ఫైర్‌లో భాగంగా అమెరికా, ఇరాన్‌ రెండు వారాలపాటు ఒకరిపై ఒకరు దాడులు, క్షిపణి ప్రయోగాలు, ప్రతీకార చర్యలు చేసుకోకూడదు. యుద్ధం కారణంగా నిలిచిపోయిన రవాణా నౌకలను హర్మూజ్‌ జలసంధి గుండా అనుమతించేందుకు ఇరాన్‌ తాత్కాలికంగా అంగీకరించింది. అయితే, ఇరాన్‌ సైనిక పర్యవేక్షణలోనే ఈ నౌకలు ప్రయాణించాలి. తదుపరి దౌత్యపరమైన చర్చల కోసం పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ రెండు దేశాల ప్రతినిధులను ఏప్రిల్‌ 10న ఇస్లామాబాద్‌కు ఆహ్వానించారు.

ఇరువైపులా విజయ ప్రకటనలు..
ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు తమ విజయంగానే అభివర్ణించుకుంటున్నాయి. ’మా సైనిక లక్ష్యాలు నెరవేరాయి. ఇరాన్‌ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిందే. భూగర్భంలో ఉన్న అణు వ్యర్థాలను తొలగించేందుకు ఇరాన్‌తో కలిసి పని చేస్తాం’ అని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్‌ తన 10 పాయింట్ల శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇందులో ఇరాన్‌పై ఆంక్షల తొలగింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ వంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇవి నెరవేరితేనే శాంతి సుస్థిరమవుతుందని ఇరాన్‌ అంటోంది.

భారత్‌ ఇంధన భద్రతకు ఊరట..
పశ్చిమాసియాలోని ఈ పరిణామం భారత్‌కు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. మన దేశ ఇంధన భద్రత హర్మూజ్‌ జలసంధిపైనే ఆధారపడి ఉంది. భారత్‌ దిగుమతి చేసుకునే వంటగ్యాస్‌లో 90 శాతం ఈ జలసంధి గుండానే వస్తుంది. గత నెల రోజులుగా సరఫరా ఆగిపోవడంతో దేశీయంగా ధరలు పెరగడమే కాకుండా కొరత ఏర్పడింది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 30 శాతం, సహజ వాయువులో 47 శాతం ఈ మార్గం ద్వారానే వస్తాయి. యుద్ధం విరమణ ప్రకటన రాగానే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 15 శాతం పడిపోయి 90 డాలర్ల స్థాయికి చేరింది. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి..
ఈ కాల్పుల విరమణ ఇరాన్‌తో యుద్ధానికి మాత్రమే వర్తిస్తుందని, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై తమ పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. ఇది చర్చల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి హర్మూజ్‌ జలసంధిలో చిక్కుకుపోయిన 16 భారతీయ నౌకలను(సుమారు 778 మంది సిబ్బందితో) సురక్షితంగా బయటకు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యంగా కనిపిస్తోంది.

ఈ రెండు వారాల సీజ్‌ఫైర్‌ భారత్‌కు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఇంధన ధరలు తగ్గడం, నౌకల సురక్షిత ప్రయాణం సాధ్యమవుతాయి. కానీ, ఇజ్రాయెల్‌–హెజ్‌బొల్లా ఘర్షణలు కొనసాగడం, ఇరాన్‌–అమెరికా మధ్య మౌలిక వ్యత్యాసాలు పరిష్కారం కాకపోవడం ఆందోళన కలిగిస్తాయి. ఏప్రిల్‌ 10న ఇస్లామాబాద్‌లో జరిగే చర్చలు నిర్ణయాత్మకంగా మారనున్నాయి.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular