
రాబోయే కొద్ది వారాల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని నిపుణులు గట్టి నమ్మకంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని చెప్పారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, వయోవృద్ధులకు వ్యాక్సినేషన్లో తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. దేశంలోని కరోనా వైరస్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారంనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని చెప్పారు. ‘ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్కు వ్యాక్సిన్ పంపిణీలో విశేషానుభవం, సామర్థ్యం ఉంది. వ్యాక్సినేషన్ రంగంలో అతిపెద్ద, అనుభవం కలిగిన నెట్వర్క్ ఉంది. వాటిని పూర్తిగా వినియోగించుకుంటాం’ అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.