కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఏపీ ప్రభుత్వం పరువు తీసింది. వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బ్యాంకులు అమలు చేయడం లేదని..రుణాలు ఇవ్వడం లేదని ఉయ్యూరు నగర పంచాయితీ కమిషనర్ డా. ప్రకాశ్ రావు ప్రోద్బలంతోనే పారిశుధ్య కార్మికులు ఈ చెత్త వేయించారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపడం.. కేంద్ర ఆర్థిక శాఖ జగన్ సర్కార్ ను చీవాట్లు పెట్టిందన్న వార్తలు వినిపించాయి. దీంతో ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఉయ్యూరు పంచాయితీ కమిషనర్ డా. ప్రకాస్ రావును తాజాగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు
ఇక ప్రభుత్వం నుంచి చీవాట్లు రావడంతో సస్పెన్షన్ కు ముందు కమిషనర్ మీడియాతో మాట్లాడారు.పారిశుధ్య సిబ్బంది, లబ్ధిదారులు కలిసి బ్యాంకుల ముందు చెత్తవేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బందికి తాను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు, పంచాయితీ వర్గాలు కలిసి ముందుకు వెళతామన్నారు.
అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పరువు తీయడంతో ప్రభుత్వం విచారణ జరిపింది. దీనికి బాధ్యులు కమిసనర్ అని తెలియడంతో ఆయన మీడియా ముందు క్షమాపణ చెప్పిన కొద్ది సేపటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది.