రాష్ట్రవ్యాప్తంగా నాలుగు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలపై రాష్ర్ట, జాతీయ స్థాయిలో రాజకీయ ప్రభావం ఉండకూడదని.. పార్టీలకు అతీతంగా ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే ఇక్కడ పార్టీల గుర్తులు ఉండవు. ఈ క్రమంలో గ్రామాల్లో వివాదాలు.. విధ్వేషాలకు తావు లేకుండా.. పార్టీల ప్రభావం ఉండకూడదని.. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పంచాయతీల ఏకగ్రీవాలను తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ప్రకారం.. నజరానా అందిస్తున్నారు. గ్రామాల జనాభాను బట్టి.. నాలుగు రకాల్లో ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు అందిస్తున్నారు. గరిష్టంగా రూ.20 లక్షల వరకు పారితోషికాలు ఇస్తున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవం కాగానే ఆయా గ్రామాలకు ఈ నజరానాలు అందిస్తారు. ఎన్నికల నేపథ్యంలో కక్షలు.. హత్యలకు తావుండకూడదని.. ఈ క్రమంలో ఏకగ్రీవ పంచాయతీలే లక్ష్యంగా ప్రజలు ఆలోచన చేయాలని వైసీపీ ప్రభుత్వం కోరుతోంది.
పంచాయతీల ఏకగ్రీవాలకు నజరానాలు ఎంతో ఉపయోగపడతాయని గ్రహించిన సీఎం వైఎస్ జగన్ గత ఏడాది ఏకగ్రీవ నజరానాలను ప్రవేశ పెట్టారు. ఎన్నికల కారణంగా ప్రజలు వర్గాలుగా విడిపోయి.. గ్రామాల అభివృద్ధిని ఇబ్బందుల్లోకి నెట్టకూడదనే ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం 2020 మార్చి 12వ తేదీన ఈ ప్రోత్సాహకాలను ప్రకటించింది. కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు.. సంక్షేమ పథకాలు అందేలా.. అనేక జాగ్రత్తలు తీసుకుని పారదర్శక పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి.. గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి పెద్ద పీఠ వేస్తున్నారు. పాలన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్.. పదేపదే చేస్తున్న ప్రకటన కారణంగా.. ఇప్పటికే రాష్ర్టవ్యాప్తంగా.. అన్ని వర్గాలకు మేలు చేసే ప్రజాహిత సంక్షేమ వాతావరణం ఏర్పడి ఉంది. ఒక గ్రామంలో నివసించే వారు అందరూ ఐకమత్యంగా.. మెలుగుతూ సంక్షేమ ఫలాలు పొందాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే నేడు ఏపీ ప్రభుత్వం పంచాయతీల ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోంది.
ఒక గ్రామానికి ఏడాది వ్యవధిలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి వచ్చే అన్ని రకాల గ్రాంట్ల ద్వారా వచ్చే డబ్బు.. ఇంటిపన్ను రూపంలో వచ్చే నిధులకన్నా.. ఏకగ్రీవాలతో వచ్చే నిధులు ఎక్కువ. సమస్యల మధ్య కొట్టుమిట్టాడే గ్రామాలు ఏకగ్రీవాల కారణంగా అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చు. గ్రామ స్వరాజ్య సాధనకు పాటు పడవచ్చు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన పెరగాలనే ఆకాంక్షతో ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. ప్రోత్సహకాలు పెంచుతూ.. పల్లెలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అభ్యంతరకరంగా మాట్లాడడం సరిగా లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. ఏదీ ఏమైనా తొలిరోజు నామినేషన్ల సందర్భంగా ఏకగ్రీవ పంచాయతీలకు వస్తున్న స్పందన చూస్తుంటే.. జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనని విశ్లేషకులు అంటున్నారు.
పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఎందరో మహానుభావులు అన్నారు. అలాంటి మాటలను నిజం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపట్టి.. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమం వెల్లివిరిసేలా.. గడపగడపకు సుపరిపాలనను అందిస్తున్నారు. వేలాది పల్లెల్లో అభివృద్ధి పథకాలు అందిస్తున్నారు. ఇదే క్రమంలో పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవ పంచాయతీలే ధ్యేయంగా జగన్ మాటతో ప్రజలు ముందుకు వస్తున్నారు.