
virat kohli century : టీమిండియా స్టార్ క్రికెటర్.. విరాట్ కోహ్లీ తన టెస్టు సెంచరీ దాహాన్ని ఎట్టకేలకు తీర్చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ బాదాడు. దీంతో.. దాదాపు 1200 రోజుల నుంచి మోస్తున్న బరువును దించుకున్నాడు. వన్డేలు, టీ20ల్లో సెంచరీలతో ఫామ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు కోసం దాదాపు మూడున్నరేళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాపై సెంచరీ చేయడానికి దశాబ్దం పట్టింది. తాజాగా ఆసీస్తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. విరాట్కిది 28వ టెస్టు శతకం కాగా.. అన్ని ఫార్మాట్లు కలిసి మొత్తంగా 75వ సెంచరీ.
నిలకడగా బ్యాటింగ్..
నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ఫస్ట్ డౌన్ బ్యాట్స్ మెన్ గా బరిలో దిగిన కోహ్లీ మ్యాచ్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్నాడు. 241బంతుల్లో శతకం పూర్తి చేశాడు.
గత సెంచరీ 2019లో..
గత టెస్ట్ సెంచరీని కోహ్లీ 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్పై నమోదు చేశాడు. మరో శతకం సాధించడానికి దాదాపు 1,200 రోజుల సమయం పట్టింది. దీని కోసం 41 టెస్టు ఇన్నింగ్స్లు ఆడాడు. తన కెరీర్లో అత్యంత ఎక్కువ బంతులను తీసుకొని మరీ సెంచరీ సాధించడం ఇది రెండోసారి. ఇప్పుడు ఆసీస్పై 241 బంతుల్లో శతకం చేయగా.. గతంలో ఇంగ్లాండ్పై 289 బంతులను తీసుకున్నాడు.
సెంచరీ విశేషాలు..
– విరాట్ కోహ్లీ స్వదేశంలో దాదాపు పదేళ్ల తర్వాత ఆసీస్పై సెంచరీ నమోదు చేయడం గమనార్హం. గతంలో 2013లో చెపాక్ వేదికగా చేశాడు.
– దాదాపు 23 టెస్టుల్లోని 41 ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్ను తాకాడు. బంగ్లాదేశ్పై 2019 నవంబర్ 22న తన 85వ టెస్టులో శతకం కొట్టాడు.
– విరాట్ కోహ్లీ 2018 డిసెంబర్ తర్వాత ఆసీస్పై ఇదే శతకం చేయడం. 2018/19 సీజన్లో బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని దక్కించుకోవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
– విరాట్ కోహ్లీకిది 28వ టెస్టు సెంచరీ కాగా.. అన్ని ఫార్మాట్లలో కలిపి 75వ శతకం. దీంతో సచిన్ తెందూల్కర్ ‘వంద’ సెంచరీల రికార్డును అందుకోవాలంటే ఇంకా 25 శతకాలు చేయాలి.
– సచిన్ మొత్తం 664 మ్యాచ్ లు ఆడగా.. విరాట్ ఇప్పటి వరకు 493 మ్యాచులను మాత్రమే ఆడాడు.