
BAN vs England : ఓడలు బండ్లవుతాయి… బండ్లు ఓడలవుతాయి అంటే ఇదేనేమో.. టీ20 ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ జట్టును పసికూడ బంగ్లాదేశ్ చావుదెబ్బకొట్టంది. ఇప్పటికే బంగ్లాదేశ్కు టి20 సిరీస్ను కోల్పోయిన ఇంగ్లండ్, ముచ్చటగా మూడో టి20 మ్యాచ్లోనూ ఓటమి పాలైంది. మంగళవారం ఢాకా వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. దీంతో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ ఓటమికి బంగ్లా బదులు తీర్చుకుంది.
158 లక్ష్యాన్ని ఛేదించలేక..
తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లిటన్దాస్(57 బంతుల్లో 73, 10 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. షాంటో 47 పరుగులు, రోనీ తలుక్దర్ 24 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్లు చెరొక వికెట్ తీశారు. 159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ మలాన్ 53 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జోస్ బట్లర్ 40 పరుగులు చేశాడు.
అలా వచి్చ.. ఇలా వెళ్లారు..
ఈ మ్యాచ్లో డేవిడ్ మలాన్(53 పరుగులు), జోస్ బట్లర్(40 పరుగులు) మినహా ఎవరూ రాణించలేదు. బంగ్లాదేశ్ బౌలర్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. తన్విర్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మన్ తలా ఒక వికెట్ తీశారు. హాఫ్ సెంచరీతో రాణించిన లిటన్దాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. నజ్ముల్ హొసెన్ షాంటో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు.