west indies vs zimbabwe t20 world cup 2026 : టి20 వరల్డ్ కప్ లో జింబాబ్వేతో జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ విధ్వంసం సృష్టించింది. కనీ వినీ ఎరుగని స్థాయిలో రికార్డులను బద్దలు కొట్టింది. జింబాబ్వే జట్టు బౌలింగ్ మొత్తాన్ని ఊచ కోత కోసింది .
ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హిట్ మేయర్ (85), పావెల్ (59) వీర విహారం చేశారు. ఫలితంగా వెస్టిండీస్ జట్టు ఈ టోర్నీలో తొలిసారిగా 250+ పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లు ఎక్స్ ట్రా ల రూపంలో 21 పరుగులు ఇచ్చారు.
ఈ మ్యాచ్లో హిట్ మేయర్ ఏకంగా ఏడు సిక్సర్లు కొట్టాడు. 34 బంతులు ఎదుర్కొన్న అతడు ఏడు ఫోర్లు.. ఏడు సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 250 గా నమోదు కావడం విశేషం. అంతేకాదు ఓ టి20 వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా హిట్ మేయర్ నిలిచాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో అతడు 17 సిక్సర్లు కొట్టాడు. 2024 ఎడిషన్ లో నికోలస్ పూరన్ 17 సిక్సర్లు కొట్టాడు. 2012లో గేల్ 16 సిక్సర్లు కొట్టాడు. 2024 లో గురుబాజ్ 16 సిక్సర్లు బాదాడు.
టి20 లో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా వెస్టిండీస్ రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో టీమిండియా నాలుగుసార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసి మొదటి స్థానంలో ఉంది. జింబాబ్వే మూడుసార్లు 250+ పరుగులు చేసి రెండో స్థానంలో.. వెస్టిండీస్ 250+ పరుగులు మూడుసార్లు చేసి మూడో స్థానంలో ఉంది.
టి20 వరల్డ్ కప్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన జట్లలో వెస్టిండీస్ రెండవ స్థానంలో ఉంది. ఈ జాబితాలో శ్రీలంక మొదటి స్థానంలో ఉంది. 2007లో కెన్యా జట్టుపై శ్రీలంక 260/6 పరుగులు చేసింది. 2026లో జింబాబ్వే పై వెస్టిండీస్ 254/6 పరుగులు చేసింది. 2026 లో ఐర్లాండ్ ఒమన్ జట్టుపై 235/5 పరుగులు చేసింది. 2016లో సౌత్ ఆఫ్రికా పై ఇంగ్లాండ్ 230/8 పరుగులు చేసింది. 2016 లో ఇంగ్లాండ్ పై సౌత్ ఆఫ్రికా 229/4 పరుగులు చేసింది. 2026లో ఓమన్ పై శ్రీలంక 225/5 పరుగులు చేసింది. జింబాబ్వే మీద ఇప్పటివరకు ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా టీమ్ ఇండియా ఉండేది. 2024లో హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 234/2 పరుగులు చేసింది. ఆ రికార్డును ఇప్పుడు వెస్టిండీస్ బద్దలు కొట్టింది.