
పాకిస్థాన్ తో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత పాక్ లోనే రెండు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపిన 34 మంది సభ్యుల న్యూజిలాండ్ బృందం ఆదివారం వేకువజామున దుబాయ్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ మాట్లాడుతూ అత్యంత భయానక పరిస్థుతుల నుంచి బయటపడ్డామని తెలిపాడు.
మ్యాచ్ కు కొన్ని గంటల ముందు తమ దేశ సక్యూరిటీ విభాగం హెచ్చరిక మేరకు తాము అలర్డ్ అయ్యామని, ఆ సమయంలో పరిస్థితులంతా ఒక్కసారిగా మారిపోయాయని, న్యూజిలాండ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే తప్పనిసరి పరిస్థితుల్లో పర్యటన రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించాడు. పాక్ క్రికెట్ కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా.. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసకోక తప్పలేదని పేర్కొన్నాడు. తమ బృంద సభ్యులు 24 గంటల పాటు దుబాయ్ లోనే సెల్ప్ ఐసోలేషన్ లో ఉంటారని, అనంతరం 21 మంది వారం వ్యవధిలో స్వదేశానికి తిరిగి వెళ్తారని, మిగిలిన సభ్యులు టీ 20 ప్రపంచకప్ బృందంతో కలుస్తారని తెలిపారు.
ఇదిలా ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయంపై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సెక్యూరిటీ హెచ్చరిక లేదు. ఏదీ లేదు. అదంతా వట్టి డ్రామా అని షాహిద్ ఆఫ్రిది మండిపడ్డాడు. మరో వైపు సిరీస్ రద్దు పై న్యూజిలాండ్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సైతం పాక్ పర్యటనపై పునరాలోచన చేస్తామని ప్రకటించిన విషయం విధితమే.