ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో రెడ్లే పెద్దసంఖ్యలో ఉన్నారు. దీంతో రాజకీయంగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పార్టీ విధేయులుగా ఉన్న వారికి మంత్రి పదవులు ఇచ్చిన జగన్ మంత్రి వర్గంలో 90 శాతం మార్పులు ఉంటాయని రెండేళ్లుగా చెబుతున్నా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో పదవులు ఆశిస్తున్న వారు కళ్లు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు. మార్పులు చేర్పులు చేపడతారనే ఊహాగానాల మధ్యే తమకు పదవులు వస్తాయనే ధీమాలో కాలం వెళ్లదీస్తున్నారు.
నాలుగు జిల్లాల్లో రెడ్లే అత్యధికం
ప్రకాశం, నెల్లూరు, గుంటూరు లాంటి జిల్లాల్లో రెడ్డి వర్గీయులే అత్యధికంగా ఉన్నారు. నాలుగు సార్లు గెలిచిన వారు సైతం తమకు మంత్రి పదవులు వస్తాయనే ధీమాలో ఉన్నారు. సీనియర్ నాయకులుగా తమకు మంత్రి పదవులు ఎప్పుడొస్తాయోననే ఆలోచనలోనే మునిగి తేలుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో రెడ్డి వర్గీయులే మంత్రి వర్గంలో ఉండగా పదవులు ఎదురుచూస్తున్న వారు సైతం ఆ వర్గం నుంచే ఉండడం గమనార్హం.
బీసీ వర్గం నుంచి కూడా..
మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో బీసీలు సైతం ఉన్నారు. ఈసారైనా మంత్రి వర్గంలో చోటు సంపాదించుకోవాలని భావిస్తున్న వారిలో బీసీలు సైతం తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. తమ పనితీరుకు ఇప్పుడైనా మంత్రి పదవి రాకపోతుందా అనే ఆశతో ఉన్నవారు చాలా మందే ఉన్నారు. ఏపీలో రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్న రెడ్డి, బీసీ వర్గాల నుంచి పదవులు ఆశించి భంగపడిన వారు సైతం ఈసారి ఖచ్చితంగా పదవులు సాధించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుుస్తోోంది. ఏదిఏమైనా రాష్ర్ట రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన రాయలసీమ నుంచే ఎక్కువ మందే పదవులు ఆశిస్తున్న వారు ఉండడంతో ఏం చేయాలో అనే మీమాంసలో జగన్మోహన్ రెడ్డి పడుతున్నట్లు సమాచారం. ఎవరికి ఇవ్వాలో ఎవరిని బుజ్జగించాలో అనే విషయంపై తర్జనభర్జన పడుతూ ఎమ్మెల్యేలను తమ దారికి తెచ్చుకోవాలనే తపనతో పదవులు రాని వారికి సైతం నామినేటెడ్ పదవులు కట్టబెట్టి బుజ్జగించాలని భావిస్తున్నట్లు సమాచారం.