AP BJP: కేంద్రంలోని అధికార బీజేపీకి ఎదురెళ్లడానికి ఏపీలోని అధికార విపక్షాలు సిద్ధంగా లేవు. ఈ విషయం మరోసారి స్పష్టమయింది. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని స్పీకర్ లేదా రాష్ట్రపతి చేయాలని ప్రధాని చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ.. కాంగ్రెస్ సహా 19 రాజకీయ పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ 19 పార్టీల్లో టీడీపీ లేదు.. వైసీపీ లేదు.. అన్నింటి కంటే ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ కూడా లేదు. ఎందుకు ఆశ్చర్యమంటే ఆ 19 పార్టీల్లో చాలా వాటితో కేసీఆర్ పని చేయాలని ప్రయత్నించిన వారే. కలిసి పని చేయడానికి సిద్ధపడినవారే. ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేస్తే.. బీఆర్ఎస్ నేతలు కూడా వారితో కలిసి కూర్చుని సమావేశాలు నిర్వహించిన వారే. అయితే ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ మార్చుకున్నారు.
కేసీఆర్ హాజరుపై అస్పష్టత..
మరి పార్లమెంట్ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా అంటే స్పష్టత లేదు. ఇంకా బీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ బీఆర్ఎస్ అనుకూల మీడియా మాత్రం అసలు మోదీ ప్రారంభించడం ఏమిటని విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అదే చెబుతోంది.
ముఖ్యనేతల మౌనం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏనిర్ణయం తీసుకున్నా.. గుడ్డిగా వ్యతిరేకించడం బీఆర్ఎస్ ముఖ్యనేతలకు అలవాటు అయింది. కానీ తాజాగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై మాత్రం అందరూ మౌనం పాటిస్తున్నారు. కేటీఆర్, కవిత కనీసం నోరు మెదపడం లేదు. జాతీయ అంశాలపై ఎక్కువగా స్పందించే కవిత కూడా ఒక్క ట్వీట్ చేయలేదు. దీంతో బీఆర్ఎస్ హాజరవడమో లేకపోతే నామోషీగా ఫీలయితే.. ఒంటరిగానే డుమ్మా ప్రకటన చేయడమో చేస్తుందని అంటున్నారు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలు ఇప్పుడు బీజేపీతో పెట్టుకుని ఇష్యూని డైవర్ట్ చేసుకోవడం కన్నా.. తమలో తాము చూసుకోవడం మంచిదని భావించినట్లుగా ఉన్నాయి. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి వెళ్లాలని రెండు పార్టీలూ నిర్ణయించుకున్నాయి. టీడీపీ కూడా బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా వ్యతిరేక వర్గంలో ఉన్నామని అనిపించుకోకూడదని తాపత్రయపడుతోంది. ఇక వైసీపీకి అయితే కేంద్రానికి అణిగిమణిగి ఉండడం అలవాటు చేసుకుంది.