YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. దీనికితోడు ప్రతిపక్షాలు రాష్ర్ట పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రయోజనం కనిపించడం లేదు. పార్టీకి ఉన్న పట్టు దృష్ట్యా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల నోటికి తాళం వేయాలంటే వైసీపీ ముందున్న ఏకైన మార్గం ముందస్తు మార్గమేనని సమాచారం. ఇప్పటికే జగన్ పార్టీ నేతలతో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పార్టీ బలంతో ఎన్నికలకు వెళితే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పినట్లు అవుతుంది. మరో మార్గంలో ఆదాయ వ్యయాల గోల నుంచి బయటపడినట్లు అవుతుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు తమ నోళ్లకు పని చెబుతున్నాయి. ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి అధికార పార్టీ సైతం తన గొంతు సవరిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం వేల కోట్లు కుమ్మరించిందని విమర్శలు చేస్తూనే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నాయి. దీంతో జగన్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా రెండేళ్లు ప్రభుత్వాన్ని నడపాలంటే మాటలు కాదు. లక్షల కోట్లు కావాల్సి ఉంటుంది. దీంతో ముందస్తు ఎన్నికలే మార్గమని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
గతంలో తెలంగాణ సర్కారు సైతం ముందస్తు మంత్రంతో రాజకీయంగా లబ్ధిపొందింది. ఇదే సూత్రాన్ని ఏపీ కూడా అవలంభించాలని చూస్తోందని సమాచారం. ప్రస్తుత పరిస్థితిలో ఏపీలో జగన్ సర్కారుపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని తెలుసుకున్న అధినేత ముందస్తు వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం దక్కించుకోవాలని చూస్తోంది. ఈక్రమంలో జగన్ సర్కారు మరో ఏడాది మిగిలి ఉండగానే శాసనసభను రద్దు చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఇదే సందర్భంలో జగన్ సతీమణి భారతిని సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో నెంబర్ 2 స్థానం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాష్ర్టంలో ముందస్తుతోనే ప్రయోజనం ఉందని అభిప్రాయపడుతోంది. ముందస్తుకు వెళ్లే విషయాలపై ఆరా తీసేందుకు ఇంటిలిజెన్స్ ను అప్రమత్తం చేసింది. రాష్ర్టంలో పార్టీ పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ రాజకీయ పరిస్థితితో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.