ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆది నుంచి వివాదాస్పదుడే అవుతున్నాడు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడాన్ని చూస్తున్నాం. మొన్నటికి మొన్న తిరుపతి ఉప ఎన్నిక సందర్భంలోనూ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాతో వీడియో వైరల్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘ఎన్నికలైతే అయిపోనీ.. 17 తర్వాత పార్టీ లేదు.. బొక్కా లేదు..’ అన్నట్లుగా మాట్లాడినట్లు వీడియో వైరల్ అయింది. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్గా తీసుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అచ్చెన్నాయుడిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారా అనే వాదనలూ వినిపిస్తున్నాయి. అలాగే.. లోకేష్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసి ఆయన అడ్డంగా బుక్ అయ్యారు.
తిరుపతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం చంద్రబాబునాయుడు, లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కరోనా పరిస్థితులను సైతం లెక్క చేయలేదు. ఎనిమిది రోజుల పాటు ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. అటు కరోనా విజృంభిస్తుంటుంటే.. ఇటు చంద్రబాబు ఊహించని సాహసమే చేశారని చెప్పొచ్చు.
అయితే.. లోకేష్ ప్రచారం ముగింపునకు ఒక రోజు మిగిలి ఉండగానే వెళ్లిపోవడం చర్చనీయాంశం అయింది. అప్పటికే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ సందర్భంలో అచ్చెన్న వ్యాఖ్యలు పార్టీకి భారీ నష్టాన్నే తెచ్చిపెట్టయంట. మరి ఈ క్రమంలో అధినేత చంద్రబాబు అచ్చెన్నాయుడిపై చర్యలు తీసుకుంటారా..? ఆయనకు అంత ధైర్యంఉందా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.