BJP Manifesto
BJP Manifesto: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో రెడీ అయింది. కాంగ్రెస్ ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసింది. పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇప్పడు కాంగ్రెస్కు దీటుగా బీజేపీ మేనిఫెస్టోను సిద్ధం చేసింది ‘మోదీస్ గ్యారెంటీ.. డెవలప్డ్ ఇండియా 2047’ అనే థీమ్తో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, హోం మంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తదితరుల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మేనిఫెస్టోను ఆదివారం(ఏప్రిల్ 14న) విడుదల చేయనున్నారు.
అభివృద్ధిపై ప్రధాన దృష్టి..
ఇక బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో ప్రధానంగా అభివృద్ధి భారతంపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మహిళలు, యువత, పేదలు, రైతుల అభ్యున్నతికి మేనిఫెస్టో భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇవ్వడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశంగా చెప్పనుంది. కల్చరల్ నేషనలిజంపై దృష్టిసారిస్తూ 2047 నాటికి అభివృద్ధి భారతం సాధిస్తామనేది మోదీ ప్రధాన గ్యారెంటీగా ఉండనుంది. ‘సబ్ కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్’ అనే మంత్రంతో సంకల్ప్ పాత్ర (బీజేపీ మేనిఫెస్టో) ఉంటుంది.
మేనిఫెస్టో కమిటీ..
ఇదిలా ఉండగా మేనిఫెస్టో రూపకల్పనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలోని మేనిఫెస్టో కమిటీ ఇప్పటికీ రెండుసార్లు సమావేశమైంది. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సూచనలు స్వీకరించింది. 15 లక్షల సూచనలు బీజేపీకి వచ్చాయి. వాటిలో 4 లక్షల సూచనలు నమో యాప్ ద్వారా, 11 లక్షల సలహాలు వీడియోల రూపంలో వచ్చాయి. 27 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కో–ఆర్డినేటర్గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కో–కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇక 543 మంది సభ్యులున్న 18వ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19తో మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న మేనిఫెస్టో విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.