Homeఆంధ్రప్రదేశ్‌శేఖర్‌‌ రెడ్డికి, వైసీపీకి ఉన్న బంధం ఏంటో..?

శేఖర్‌‌ రెడ్డికి, వైసీపీకి ఉన్న బంధం ఏంటో..?

Sekhar Reddy
శేఖర్‌‌ రెడ్డి.. తమిళనాడు వ్యాపారవేత్త. ఆయన తమిళనాడు పార్టీలకే కాదు.. ఏపీలోని వైసీపీకి కూడా దగ్గరివాడే. అక్కడి రాజకీయ పార్టీలకే కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి భారీ విరాళం ఇచ్చారు. దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. మొత్తం వైసీపీకి ఏడాదిలో తొమ్మిదిన్నర కోట్ల రూపాయల విరాళం వస్తే అందులో 30 శాతం శేఖర్ రెడ్డిదేనన్నమాట. అంతగా శేఖర్ రెడ్డికి వైసీపీపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో.. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల స్థాయిలో విరాళాలు ఎందుకిస్తున్నారో అంచనా వేయడం పెద్ద కష్టమేం కాదనేది కొంత మంది చెప్పే మాట.

Also Read: జగన్ పై మెగా బ్రదర్ ప్రశంసలు.. బుక్కైన నాగబాబు

శేఖర్‌‌రెడ్డి వ్యాపారాలన్నీ తమిళనాడులోనే ఉన్నాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఆయన టీటీడీ బోర్డు మెంబర్. పాత నోట్ల రద్దు సమయంలో కొత్త నోట్లు ఆయన ఇంట్లో ఆర్బీఐ చెస్ట్ రేంజ్‌లో బయటపడటంతో కలకలం రేగింది. అప్పట్లో ఆయన చంద్రబాబుకు బినామీ అని.. ఆ సొమ్మంతా చంద్రబాబుదేనని వాదించిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్, ఆయన మీడియా.. ‘సాక్ష్యాలతో సహా’ ఆరోపించింది.

ఆ సాక్ష్యాలన్నీ ఇప్పుడు ఏమైపోయాయో కానీ అధికారంలోకి రాగానే మళ్లీ ఆయననే నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించారు. ఆయనపై ఆరోపణలతో ఏ టీటీడీ బోర్డుపదవి నుంచి గత ప్రభుత్వం పీకేసిందో.. అదే బోర్డు పదవిని ప్రస్తుత ప్రభుత్వం అప్పగించింది. అంతే కాదు.. ఆయనకు.. ఆయనకు చెందిన కంపెనీలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Also Read: టీడీపీకి షాక్.. అంగుళం భూమిని వదలని జగన్

నిజానికి శేఖర్ రెడ్డి విషయంలో వైసీపీ చేసినంత రచ్చ ఇతర పార్టీలు చేసి ఉంటే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నీడ కూడా తమ పార్టీపై పడకుండా జాగ్రత్త పడేవారు. ఏమైనా సంబంధాలు పెట్టుకోవాలంటే తెర వెనుకే నడిపించేవారు. కానీ.. అదేంటో వైసీపీ ఆయనను తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్‌ను చేసింది. ఏపీలో ఇసుక విధానం మార్చింది కూడా ఆయన కోసమేనన్న ప్రచారం జరుగుతోంది. శేఖర్‌‌ రెడ్డికి వైసీపీతో ఉన్న సంబంధాలు ఏంటో కానీ.. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో వైసీపీ మాత్రం విమర్శలు ఎదుర్కొంటోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular