ఈటల రాజేందర్ వ్యవహారం టీఆర్ఎస్ లో చర్చకు దారి తీస్తోంది. ఇన్నాళ్లు ఈటలను బహిష్కరిస్తారని ప్రచారం జరిగినా ఆయనే రాజీనామా చేసి వారికి అవకాశం ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉప ఎన్నికలో తేల్చుకోవాలనుకున్న లక్ష్యంతో స్పీకర్ కు రాజీనామా ఇవ్వాలనుకున్నారు. కానీ స్పీకర్ సమయం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఈటల రాజీనామా వ్యవహారం రసకందాయంలో పడింది. ఈటల విషయంలో ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈటల రాజేందర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పింఛన్లు, రేషన్ కార్డుల దగ్గర నంచి అన్నింటిని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై ఎంత ధిక్కారస్వరం వినిపించినా పట్టించుకోవడం లేదు. మీడియా సమావేశాల్లో టీఆర్ఎస్ తీరుపై పదునైన పదజాలాన్ని వాడుతున్నారు.
ఈటల రాజీనామా నిర్ణయం తీసుకోకముందు ఆయనపై వేటు వేయబోతున్నామని హడావిడి చేశారు కానీ ఆచరణలో చూపించలేదు. ఈటల రాజీనామా చేస్తానని చూసినా స్పీకర్ సమయం ఇవ్వకపోవడంపై సర్కారు ప్రమేయం ఉందని అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హుజురాబాద్ ఉపఎన్నికను ఎలా ఎదుర్కోవాలనే దానిపై సర్కారుకు ఇంకా ప్రణాళిక ఖరారు కాలేదని తెలుస్తోంది. అక్కడ పాతుకుపోయిన ఈటలను ఓడించాలంటే సర్వ శక్తులూ ఒడ్డాల్సిందే. దీంతో బలం పెంచుకునేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తోందని సమాచారం. ఈటలకు సానుభూతి పెద్ద మొత్తంలో ఉండడంతో గులాబీ పార్టీలో గుబులు రేగుతోంది. ఈటలను ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో అన్ని దారులు వెతుకుతోంది.