భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం సీతమ్మసాగర్ బహుళార్ధసాధక బ్యారేజీ నిర్మాణం తలపెట్టింది. ఈ బ్యారేజీకి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 68.9 ఎకరాలు అటవీ భూమిని తెలంగాణ నీటిపారుదలశాఖకు బదిలీ చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం అటవీ భూమిని బదలాయించింది. దీంతోపాటు బ్యారేజీ నిర్మాణానికి తుది పర్యావరణ అనుమతులు కూడా మంజూరు చేసింది.
దేవాదుల ప్రాజెక్టుకు నిరంతరం నీటిసరఫరా కోసం సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం చేపట్టింది. గోదావరి నదిపై చెప్పుకోదగ్గ జలవిద్యుత్ కేంద్రం లేదనే లోటును తీర్చేలా తెలంగాణ ప్రభుత్వం దుమ్ముగూడెం బ్యారేజ్ కు రూపకల్పన చేసింది. 37 టీఎంసీల నీటినిల్వతో 70 గేట్లతో చేపడుతున్న ఈ బరాజ్ వద్ద సాంకేతికంగా హెడ్ అనుకూలంగా ఉండటంతో ఏకంగా 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం… ములుగు మండలం ఏటూరు నాగారం, వెంకటాపురం అటవీ డివిజన్లలో భూమి సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తాజాగా ఇందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.