తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రస్తుతం ప్రక్షాళన నడుస్తోందా..? ఇటీవలే తన పీఏను సాగనంపిన కేసీఆర్.. త్వరలో కొందరు సీనియర్ లీడర్లకు కూడా విరమణ ప్రకటించనున్నారా..? ప్రస్తుతం రాష్ట్ర పాలనలో ఇదే చర్చ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఆరుగురు సీనియర్లు శాసనమండలి నుంచి రిటైర్ అవుతున్నారు. కేసీఆర్ వారికి మళ్లీ ఛాన్సిచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
ఒక గవర్నర్ కోటా స్థానంతోపాటు మరో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు జూన్లో ఖాళీ అవుతున్నాయి. గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దిన్, ఆకుల లలిత ఈ ఆరుగురు పదవి విరమణ చేయనున్నారు. వీరిలో అందరూ ఫిరాయింపుల ద్వారా బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్లోకి వచ్చిన వారే. అప్పట్లో పార్టీ అవసరాల కోసం వీరిని తీసుకుని మళ్లీ పదవి ఇవ్వడం చేసి ఉంటారని అప్పుడు పెద్ద స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అందుకే.. ఈ సారి మాత్రం ఉద్యమకారులకు ఛాన్సిస్తారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
గుత్తా సుఖేందర్రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ ఇవ్వకపోవచ్చని టీఆర్ఎస్లో గట్టి ప్రచారం జరుగుతోంది. శాసనమండలి చైర్మన్గా పీవీ కుమార్తె పేరును ఇప్పటికే ప్రచారంలో పెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అలాగే కడియం శ్రీహరికి కూడా ఈ సారి ఛాన్సివ్వరని వచ్చే ఎన్నికల్లో పోటీకి టిక్కెట్ ఇస్తామన్న హామీతో సరి పెడతారని అంటున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సమయంలో అగ్ర తాంబూలం దక్కింది కానీ.. తర్వాత ఆయన పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. త్వరలో ఆయన ఎమ్మెల్సీ కూడా కాకుండా టీఆర్ఎస్ నేతగా మిగిలిపోనున్నారని అంటున్నారు. ఆకుల లలిత కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా గెలిచి.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడిపోయి టీఆర్ఎస్లో చేరారు. ఆమెకు ప్రాధాన్యం ఇస్తే ఇతర నేతలకు అసంతృప్తి పెరుగుతుంది. అందుకే కేసీఆర్ ఆమెకు ఛాన్సిచ్చే అవకాశాల్లేవంటున్నారు.
ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు రేసులో చాలా మంది ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి దేశపతి శ్రీనివాస్. ఆయన పేరు చాలా సార్లు ప్రచారంలోకి వచ్చినా ఇవ్వలేదు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఉద్యోగ సంఘం మాజీ నేత దేవీ ప్రసాద్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, గుండు సుధారాణి, తుమ్మల నాగేశ్వర్రావు, బొంతు రామ్మోహన్.. ఇటీవలే ఎమ్మెల్సీ హామీ పొందిన సాగర్ నేత కోటిరెడ్డి.. లాంటి వాళ్లు చాలా మంది రేసులో ఉన్నారు. ఎంత మంది సీనియర్లకు ఛాన్సివ్వాలి.. ఎంత మంది కొత్త వారిని తీసుకోవాలనేది ఇప్పుడు కేసీఆర్ ముందున్న టాస్క్. ఈ సారి ఎమ్మెల్సీల ఎంపిక కష్టతరంగానే కనిపిస్తోంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More