JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్ విద్యార్థులకు సరిగా మార్కులు వేయకపోవడంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిణామాన్ని నిరసిస్తూ చాలామంది విద్యార్థులు రోడ్లమీదకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. అయితే నాడు చాలామంది విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారు. వారిలో చాలామంది గాయపడ్డారు. ఇక ఇదే భారత రాష్ట్ర సమితి పరిపాలన కాలంలో గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి పేపర్ రెండుసార్లు లీక్ అయింది. అయినప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. చివరికి గ్రూప్ వన్ పరీక్షను సక్రమంగా నిర్వహించాలని అసమర్థ ప్రభుత్వంగా భారత రాష్ట్ర సమితి అపప్రదను మూటకట్టుకుంది
ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ పేపర్ లీకుల బాగోతం మాత్రం అలానే ఉండిపోయింది. ఇంటర్ లాంగ్వేజ్ పేపర్.. ఎస్ఎస్సి లాంగ్వేజ్ పేపర్ లీక్ అయ్యాయి. జమ్ము కాశ్మీర్లో సర్వీస్ ఎలక్షన్ బోర్డ్ పేపర్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ ఈ బీ పేపర్.. జార్ఖండ్ రాష్ట్రంలో హిందీ, సైన్స్ పేపర్లు.. తమిళనాడు రాష్ట్రంలో బీఈడీ కోర్స్ పేపర్.. బెంగాల్ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్.. పంజాబ్.. కేరళ.. కర్ణాటక రాష్ట్రంలో కూడా పేపర్లు లీక్ అయ్యాయి.
ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్.. ఇతర ప్రభుత్వాలు అధికారంలో ఉంది. ఇంత జరిగినప్పటికీ నేషనల్ మీడియా ఈ వ్యవహారాల మీద ఎటువంటి కథనాలను ప్రసారం చేయలేదు. చివరికి స్థానికంగా ఉన్న మీడియా కూడా వీటికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు నీట్ గురించి మాట్లాడుతున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన తర్వాత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. ఆ తర్వాత ఈ దారుణాలకు పాల్పడిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేసింది. వారంతా కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిని పెద్ద యాగి చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రం జరిగిన పేపర్ లీకేజీ గురించి నాయకులు మాట్లాడటం లేదని బిజెపి అగ్ర నాయకుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఆయన రాష్ట్రాలలో జరిగిన పేపర్ లీకేజీల గురించి ఆయన ఒక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయా రాష్ట్రాలలో జరిగిన పేపర్ లీకుల గురించి వివరించారు.
ఇక్కడ జేపీ నడ్డా తెలుసుకోవాల్సింది ఒకటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇటువంటి వ్యవహారాలు చాలా జరిగాయి. అవి జరగకూడదనే కదా కేంద్రంలో బిజెపికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది. బిజెపి రూలింగ్ లో కూడా పేపర్ లీకేజీలు జరగడం.. చివరికి యుద్ధ విమానాలలో ప్రశ్నపత్రాలను పంపించడం.. ఎటువంటి సమర్థతకు నిదర్శనమో నడ్డా చెప్పాలి. విలేకరుల ముందు ఏమైనా మాట్లాడవచ్చు. కానీ ఒకసారి ప్రశ్నించే అధికారాన్ని ప్రజలకు ఇస్తే.. తలవంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు బిజెపికి ఇటువంటి పరిస్థితే ఎదురవుతోంది. మరి ఈ సమస్యను ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి విధానంలో పరిష్కరిస్తుందో చూడాలి.






