తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న పాలిటిక్స్.. ఈటల ఎపిసోడ్ తో ఒక్కసారిగా వేడెక్కాయి. మొత్తానికి ఈటల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో.. నేతల మధ్య కౌంటర్లు, ఎన్ కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. కీన్ గా అబ్జర్వ్ చేస్తే సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై కొన్ని రోజులుగా విపక్షాలు మాటల దాడి చేస్తున్నాయి!
చాలా మందికి విషయం ఏంటన్నది అర్థం కాలేదు. ఈటల ఎపిసోడ్ తో గానీ.. మరో విషయంలోగానీ ప్రస్తుతానికైతే కవితకు సంబంధం లేదనే అనుకోవాలి. మరి, అలాంటప్పుడు కవితను ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు అనే ప్రశ్న తలెత్తింది. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం తెరవెనుక కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
కవితకు మంత్రి పదవి ఇస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. కానీ.. ఇప్పటి వరకు అది జరగలేదు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కవిత కొన్నాళ్లు బయట కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఇన్వాల్వ్ కాలేదు. ఎమ్మెల్సీ అయిన తర్వాత యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎలాగో ఓ ప్రజాప్రతినిధిగా కవిత ఉన్నారు కాబట్టి.. పనిలో పనిగా కూతురికి కీలక బాధ్యతలు అప్పగిస్తే అయిపోతుందని చూస్తున్నారట కేసీఆర్. అయితే.. అది ప్రభుత్వంలోనా? పార్టీలోనా? అన్నది తెలియాల్సి ఉందని అంటున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. మరి, కూతురిని కూడా మంత్రిని చేస్తే.. విమర్శలు భారీగా వస్తాయనే ఆలోచనలో ఉన్నారట కేసీఆర్. ఇప్పటికే కుటుంబం నుంచి ముగ్గురు మంత్రివర్గంలో ఉన్నారు. కాబట్టి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూతురికి ఇవ్వాలని చూస్తున్నారట. ఆ తర్వాత కేటీఆర్ ను సీఎం సీటులో కూర్చోబెట్టాలని భావిస్తున్నారట. ఈ విషయం బయటకు తెలియడంతోనే.. విపక్షాలు ఆమెపై అవినీతి ఆరోపణలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి, ఇందులో వాస్తవం ఎంత ఉంది? కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? అన్నది చూడాలి.