Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల సమరంలో మొదటి అంకమైన నామినేషన్ల ఘట్టం పూర్తయింది. దీంతో అన్ని పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. అయితే ఈసారి ఎన్నికల బరిలో మూడు ప్రధాని పార్టీలకు చెందిన ఏడుగురు ఎంపీలో బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. 2019 లోక్సభ ఎన్నికల్లో నెగ్గిన నేతలు.. పొగొట్టుకున్న చోట వెతుక్కోవాలని, మరోమారు అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి ముగ్గురు చొప్పున, బీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో ఎంతమంది గెలుస్తారో డిసెంబర్ 3న తేలిపోతుంది.
కాంగ్రెస్లో ముగ్గురూ సీఎం అభ్యర్థులే..
కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన ముగ్గురు ఎంపీలు ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నవారే.
– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్లో చేరి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజిగిరి నుంచి గెలుపొందారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీలో ఉన్న కామారెడ్డి నుంచి బరిలో దిగారు.
– మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి హుజూర్నగర్ నుంచి పోటీలో నిలబడ్డారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఆయన హుజూర్ నగర్ నుంచి గెలిచినప్పటికి, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశం మేరకు నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తన సతీమణి పద్మావతిరెడ్డిని హుజూర్నగర్ నుంచి బరిలోకి దించగా సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్కు చెందిన శానంపూడి సైదిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
– మరో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం నల్గోండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు.
బీజేపీ నుంచి ముగ్గురు..
ఇక బీజేపీ నుంచి కూడా ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
– సంజయ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్పై గెలుపొందారు.
– 2019 ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు.
– మరో బీజేపీ ఎంపీ సోయం బాబురావు 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా ఆయన బోథ్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మళ్లీ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.
– ఇక అధికార బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీలో నిలబడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఆయనపై ఓ వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన వీల్ చైర్లోనే వచ్చి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.