
High court CJs: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్ లను మారుస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఖాళీ ఏర్పడింది. ఆమె స్థానంలో కర్నాటక హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మను తెలంగాణ సీజేగా నియమించింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని చత్తీస్ గడ్ హైకోర్టుకు మార్చారు. చత్తీస్ గడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఇంతవరకు సేవలందించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సీజేగా వచ్చారు.
దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు క్రిమినల్ కేసుల వేగవంతానికి ప్రయత్నిస్తున్న సుప్రీంకోర్టు ఈ బదిలీలు చేసింది. కొలీజియం సిఫారసు మేరకు బదిలీలు ప్రారంభమయ్యాయి. ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరిని గత ఏడాది సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ అరూప్ గోస్వామిని నియమించింది. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంతో ఈ నియామకం సంచలనం కలిగించింది.
తరువాత జస్టిస్ అరూప్ గోస్వామి ఈ ఏడాది ఆరంభంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కూడా మూడు రాజధానుల కేసు విచారణ ప్రారంభించారు. రెగ్యులర్ విచారణ జరిపే లోపే ఆయన కూడా బదిలీ కావడంతో మూడు రాజధానుల వ్యవహారం మొదటికి వచ్చింది. మూడు రాజధానులపై జస్టిస్ అరూప్ గోస్వామి ధర్మాసనం నవంబర్ 15న రెగ్యులర్ విచారణ చేపట్టాలని బావించింది. కానీ ఈ బదిలీతో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
దీంతో గత నెల ఆగస్టు 31న సుప్రీంకోర్టుకు నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం జడ్జిలుగా హిమా కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్ నాథ్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది