Indian Army: ఆపరేషన్ సింధూర తర్వాత భారతదేశం సొంతంగా ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. ఆత్మనిర్భారరత్ లో భాగంగా
భా స్వదేశంలోనే సరికొత్త ఆయుధాలు తయారు చేసేందుకు వివిధ దేశాలతో ఒప్పందం చేసుకుంది. మరోవైపు రక్షణ బడ్జెట్ ని కూడా భారీగా పెంచింది. దీంతో భారత సైన్యం ప్రాథమిక ఆయుధ వ్యవస్థలో ముఖ్యమైన మార్పు రాబోతోంది. స్వదేశీ సాంకేతికతతో తయారుచేసిన ఏకే-203 రైఫిల్కు ‘షేర్’ అనే పేరు పెట్టింది. ఇది అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఇది ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో చేరనుంది.
యూపీలో ఉత్పత్తి కేంద్రం..
ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ రైఫిల్లను తయారు చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా భారతీయ భాగాలు, ముడి పదార్థాలతోనే నిర్మించిన మొదటి నమూనా పరీక్షల్లో విజయం సాధించింది. గ్యాస్ ఆపరేటెడ్ వ్యవస్థతో పనిచేసే ఈ ఆయుధం నిమిషానికి సుమారు 700 రౌండ్లు కాల్చగల సామర్థ్యం కలిగి ఉంది.
సైన్యంలో చేరికకు సన్నాహాలు..
టెస్టింగ్ కోసం త్వరలోనే కొన్ని ప్రోటోటైప్లను సైన్యానికి అందజేయనున్నారు. సెప్టెంబర్ 2026లో అధికారిక పరీక్షలు జరగనున్నాయి. విజయవంతమైతే, ప్రస్తుతం వాడుతున్న పాత ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఇవి విస్తృతంగా ప్రవేశపెట్టబడతాయి. ఇది సైనికుల యుద్ధ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, సరఫరా గొలుసులో స్వయం సమృద్ధిని నిర్ధారిస్తుంది.
ఈ విజయం విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా స్థానిక పరిశ్రమల నుంచి అన్ని భాగాలను సేకరించి, పూర్తి స్థాయి స్వదేశీ ఉత్పత్తికి చేరుకుంది. ఉత్పత్తి వేగం పెంచి, ఒక రైఫిల్ను సుమారు 100 సెకన్లలో తయారు చేసే సామర్థ్యం వైపు కదులుతున్నారు. లక్షలాది రైఫిళ్ల సరఫరా షెడ్యూల్ను ముందుకు తీసుకురానున్నారు. భారత రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యానికి ఈ ‘షేర్’ రైఫిల్ ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తోంది.