ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకొని.. దేశ ప్రజలను చిగురుటాకులా వణికిస్తున్నారు తాలిబన్లు. ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. ధ్వంసం.. విధ్వంసం కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఆ దేశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. తాలిబన్లకు ఎదురు నిలిచే వ్యక్తి రంగంలోకి రావడమే ఆ పరిణామం. ఇంతకీ అతనెవరు? అతనొక్కడు ఏం చేయగలడు? అన్నది చూద్దాం.
అతని పేరు అహ్మెద్ మసూద్. ఇతని గురించి మాట్లాడుకునే ముందు ఇతని తండ్రి గురించి తెలుసుకోవాలి. ఇతని తండ్రి అహ్మెద్ షా మసూద్. అప్పట్లో ఆఫ్ఘన్లో తిష్టవేసిన సోవియట్ సైన్యానికి ఎదురు నిలిచినవాడు. ఇందుకోసం నార్దర్ అలయన్స్ అనే సంస్థను 1979లో స్థాపించాడు అహ్మెద్ షా మసూద్. అఫ్ఘనిస్తాన్ లోని పంజషీర్ అనే ప్రావిన్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు కొనసాగించాడు. అతని పోరాటం ఏ స్థాయిలో కొనసాగిందంటే.. ఆఫ్ఘన్ మొత్తాన్ని సోవియట్ సైన్యం అదుపులోకి తీసుకున్నప్పటికీ.. పంజషీర్ లో మాత్రం అడుగు పెట్టలేకపోయింది.
ఇక, తాలిబన్ల విషయంలోనూ సీన్ రిపీట్ అయ్యింది. 1996లో ఆఫ్ఘన్ ను ఆక్రమించిన తాలిబన్లు.. 2001 వరకు పాలన సాగించారు. ఈ సమయంలో ఆఫ్ఘన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. పంజషీర్ ను మాత్రం టచ్ చేయలేకపోయారు. ఇదీ.. అహ్మెద్ షా మసూద్ కెపాసిటీ. అలాంటి మసూద్ ను ఆల్ ఖైదా హత్య చేసింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై విమాన దాడి చేయడానికి రెండు రోజుల ముందు మసూద్ ను చంపేశారు.
తండ్రి మరణం తర్వాత పంజషీర్ ప్రావిన్సు బాధ్యతలు తీసుకున్నాడు ఆయన కుమారుడు అహ్మెద్ మసూద్. ఇప్పుడు ఇతనే.. తాలిబన్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఇతనితో మరికొందరు కలిసేందుకు చూస్తున్నారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు దేశం వదిలి పారిపోయిన తర్వాత.. తానే అధ్యక్షుడినని అమృల్లాహ్ సలెహ్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. తాలిబన్లను ఎదుర్కొంటానని కూడా ఆయన ప్రకటించారు. ఇప్పుడు అమృల్లాహ్ సలెహ్.. అహ్మెద్ మసూద్ చేతులు కలపబోతున్నారు.
వీరే కాకుండా.. తాలిబన్ల రాకతో చెల్లాచెదురైన ఆఫ్ఘన్ సైన్యం కూడా వీరితో కలవబోతోందని తెలుస్తోంది. మిలటరీతోపాటు పోలీసులు కూడా తమ ఆయుధాలతో పంజ షీర్ కు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వీరంతా అహ్మద్ మసూద్ ఆధ్వర్యంలో తాలిబన్లపై పోరాడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దాదాపు లక్ష మంది సైన్యం వీరితో కలబోతున్నట్టు తెలుస్తోంది.
వీరికి అవసరమైన ఆయుధాలు కూడా మసూద్ వద్ద ఉన్నాయట. ఈ మేరకు వాషింగ్టన్ డీసీ ఒక కథనం ప్రచురించింది. ‘‘ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే.. అధునాత ఆయుధాలు కొనుగోలు చేసి భద్రపరుస్తూ వచ్చాను. ఇప్పుడు ఆఫ్ఘన్ సైన్యం, పోలీసులు కూడా తమ ఆయుధాలతో వస్తున్నారు. నేను నా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాను. తాలిబన్లపై యుద్ధం కొనసాగిస్తాను’’ అని వ్యాఖ్యానించినట్టుగా వార్త ప్రచురితమైంది.
అయితే.. ఇది అనుకున్నంత తేలికైతే కాదు. తాలిబన్లకు చైనా, పాకిస్తాన్ సహకారం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇటు రష్యాకు అహ్మద్ మసూద్ తండ్రికి పడదు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో.. మసూద్ నాయకత్వంలోని ఆఫ్ఘన్లు.. తాలిబన్లపై ఏమేరకు పోరాటం సాగించగలరు? అన్నది ప్రశ్న. మొత్తానికి ఆఫ్ఘన్లో మరో కీలక పరిణామమైతో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి, అవి ఎలాంటి పరిస్థితులకు కారణమవుతాయన్నది చూడాలి.