అనకాపల్లిలో వైసిపి ఎంపీ కుటుంబంకు చెందిన కల్యాణ మండపంలో రేషన్ బియ్యం దర్శనమివ్వడం కలకలం రేపుతున్నది.
స్థానిక ఎంపీ డా. సత్యవతి కుటుంబం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వివేకానంద ట్రస్ట్ కు చెందిన కల్యాణమండపంలో సోమవారం రాత్రి అన్లోడ్ జరిగిన రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకోవడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
రేషన్ షాప్ లకు వెళ్ళవలసిన రేషన్ బియ్యాన్ని అన్లోడ్ చేస్తుండగా సిపిఎం కార్యకర్తలు పట్టించారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ శివశంకర్ అనకాపల్లి వెళ్లి విచారణ జరిపారు. బియ్యం దారిమళ్లింపు వాస్తవమేనని విచారణలో తేలడంతో ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిని సస్పెండ్ చేశారు.
అలాగే 30వ నంబరు డిపో డీలర్ను కూడా సస్పెండ్ చేశారు. వాహనాన్ని దారిమళ్లించిన కాంట్రాక్టర్-2 వాహనాన్ని సీజ్ చేసి, బ్లాక్ లిస్టులో పెట్టారు.
వాహనంలో పది టన్నుల బియ్యం తరలింపునకు మాత్రమే రిలీజ్ ఆర్డర్లు వుండగా, 10.5 టన్నులు తీసుకువెళ్లినట్టు తేలడంతో సంబంధితులపై చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ డీవీఎంకు శివశంకర్ సూచించారు. ఎంపీ ట్రస్టుపై 6ఏ కేసు పెట్టాలని డిప్యూటీ తహసీల్దార్ను ఆదేశించారు.
ఇలా ఉండగా, ఈ నెల 30న జరుగనున్న అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి జన్మదిన వేడుకల్లో పేదలకు పంపిణీ చేయడానికి బియ్యం పంపాలంటూ కొంతమంది రేషన్ డీలర్లను ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
కానీ రేషన్ బియ్యం ఇలా ఇవ్వడం సాధ్యం కాదని, పంపిణీ వ్యవహారమంతా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు అవుతుందని చెప్పడంతో డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రేషన్ డీలర్ల అసోసియేషన్ బియ్యం పంపినట్టు తెలుస్తున్నది.