
గల్ఫ్ దేశాలైన దుబాయ్, సౌదీ, ఒమన్ లాంటి దేశాల్లో బోర్ వేస్తే నీళ్లకు బదులు పెట్రోల్, చమురు ఉబికి వస్తుంది. ఆ దేశాల్లో విరివిగా చమురు నిక్షేపాలు ఉండడంతో అలా పెట్రోల్ ను బోర్లతో తవ్వితీసి అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు.
కానీ వ్యవసాయ ఆధారిత ఏపీలో బోర్ వేస్తే నీళ్లు రావడం లేదు.. పెట్రోల్ వస్తోంది. ఈ విచిత్రం చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగర నడిబొడ్డున గోపాలపట్నం రామకృష్ణనగర్ ప్రాంతంలో ఈ వింత చోటుచేసుకుంది.
ఇక్కడ బోర్ వేయగా వాటర్ లో పెట్రోల్ కలుస్తోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. గత ఐదేళ్లుగా మున్సిపల్ వాటనే వాడుతున్నారు.సొంత బోర్లు వేసినప్పటికీ అందులోంచి పెట్రోల్ వస్తోంది. దీంతో మున్సిపల్ సరఫరా చేసే నీరే వీరికి దిక్కవుతోంది.
ఇక్కడి పక్కనే ఉండే భారత్ పెట్రోల్ బంక్ వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని కాలనీ వాసులు అంటున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆర్కేనగర్ వాసులు వాపోతున్నారు.
విశాఖపట్నం 91వ వార్డు రామకృష్ణనగర్ తోపాటు పక్క ప్రాంతాలు కూడా ఇలాంటి నీటితోనే ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంత వాసులకేఈ సమస్య ఉంది. బోర్ నుంచి వచ్చే నీళ్లలో పెట్రోల్ కలుషితం అవుతోందని కాలనీవాసులు చెబుతున్నారు.
భారత్ పెట్రోల్ బంక్ ట్యాంకు పగిలి అందులోంచి పెట్రోల్, డీజీల్ నాలుగేళ్ల క్రితం భూగర్భంలోకి లీక్ అయ్యింది. గ్రౌండ్ లెవల్ మొత్తం కలుషితమైంది. దీంతో దీని పక్కన ఉన్న కాలనీలో ఏ ప్రాంతంలో బోర్ వేసినా నీళ్లలో పెట్రోల్ వస్తోంది. దీంతో ఆ నీటిని వాడలేని పరిస్థితి కాలనీ వాసులకు నెలకొంది.
ఇక మున్సిపల్ సరఫరా చేసే నీరు సరిపోవడం లేదని. బోర్ నీళ్లు వాడక ఇబ్బందులు పడుతున్నామని ఆర్కేనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుతున్నారు.