Pakistan Public Opinion : 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి 1947 ఆగస్టు 15న అఖండ భారత దేశం స్వాతంత్య్రం పొందింది. అయితే స్వాతంత్య్రం సిద్ధించిన వెంటనే మహ్మద్ అలీజిన్నా ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలంటూ అఖండ భారత విభజన ప్రతిపాదన చేశారు. ఈ క్రమంలో భారత దేశాం ఇండియా, పాకిస్తాన్గా విడిపోయాయి. 1950 నుంచి పాకిస్తాన్ ఆగస్టు 14న, భారత దేశం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం రెండు దేశాలు 80వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నాయి. ఈ నేపథ్యంలో మన దాయాది దేశమైన పాకిస్తాన్తో ఉన్న వైరం తగ్గడం లేదు. ఇటీవల అమెరికన్ థింక్ట్యాంక్ ప్యూ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ఈ వైరంలో కొత్త కోణాలను వెల్లడించింది.
మన తర్వాత ఆ రెండు దేశాలే..
నివేదిక ప్రకారం పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ వ్యవహారంలో రెండు వైపులా కనిపించే ధోరణి స్పష్టమైంది. అక్కడి ప్రజల్లో అత్యధికులు భారతదేశాన్ని ప్రధాన శత్రువుగా చూస్తున్నారు. తర్వాతి స్థానాల్లో అమెరికా, ఇజ్రాయెల్ నిలిచాయి. రక్షణ, ఆర్థిక రంగాల్లో వాషింగ్టన్తో ఒప్పందాలు కుదుర్చుకున్నా, సామాన్యుల హృదయాల్లో అమెరికాపై తీవ్ర అపనమ్మకం కొనసాగుతోంది. బయటకు స్నేహపూర్వకంగా కనిపించినా, లోపల అగ్రరాజ్యంపై ద్వేషం మాత్రం తగ్గడం లేదు. పాకిస్తాన్లో 43 శాతం మంది భారతదేశాన్ని అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నారు. 24 శాతం మంది అమెరికాను, మరో 24 శాతం మంది ఇజ్రాయెల్ను తమ శత్రు దేశాలుగా చూస్తున్నారు.
భారతీయులు కూడా అంతే..
భారతదేశంలో సర్వేలో పాల్గొన్నవారిలో 54 శాతం మంది పాకిస్తాన్ను అతిపెద్ద భద్రతా సవాల్గా భావిస్తున్నారు. 21 శాతం మంది చైనాను తర్వాతి స్థానంలో ఉంచారు. ప్రపంచ శక్తులపై నమ్మకం విషయంలో రష్యా ముందుంది. 36 శాతం మంది దాన్ని అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా చూస్తున్నారు. 16 శాతం మంది అమెరికాను ప్రధాన భాగస్వామిగా పరిగణిస్తున్నారు. రష్యాపై 58 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. దాని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై 51 శాతం మంది మంచి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇతర దేశాలపై పాకిస్తాన్లో..
పాకిస్తానీయుల్లో 75 శాతం మంది చైనాను నిజమైన మిత్రుడిగా భావిస్తున్నారు. 90 శాతం మంది దానిపై సానుకూలంగా ఉన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్పై 83 శాతం మంది పూర్తి నమ్మకం ఉంచారు. సౌదీ అరేబియాపై మాత్రం కేవలం 12 శాతం మందే విశ్వాసం చూపించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై కేవలం 12 శాతం మంది మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు.
పొరుగు దేశాల్లో భారత్పై ఇలా..
శ్రీలంకలో 79 శాతం మంది భారతదేశంపై సానుకూలంగా ఉన్నారు. 63 శాతం మంది అత్యంత ముఖ్యమైన మిత్రదేశంగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో 42 శాతం, పాకిస్తాన్లో కేవలం 7 శాతం మంది మాత్రమే అనుకూల దృక్పథం చూపించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో చాలామంది భారతదేశాన్ని పెద్ద ముప్పుగా చూస్తున్నారు.
భారత్పై అమెరికన్ల సానుకూలత..
అమెరికాలో 45 శాతం మంది భారతదేశాన్ని అనుకూలంగా చూస్తున్నారు. 50 శాతం మంది ప్రతికూలంగా ఉన్నారు. రిపబ్లికన్లలో 42 శాతం మంది సానుకూలంగా ఉండగా, డెమొక్రాట్లు, స్వతంత్రుల్లో 50 శాతం మంది అనుకూల దృక్పథం కలిగి ఉన్నారు.
ఈ నివేదిక భారత్–పాక్ సంబంధాలు, ప్రాంతీయ శక్తులపై ప్రజల భావాలు ఎలా ఉన్నాయో స్పష్టం చేస్తోంది. బయటి ఒప్పందాలు ఒకటైనా, సామాన్యుల అవగాహన మరోలా ఉంది.