TDP Janasena Alliance
TDP Janasena Alliance: ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టుంది వైసిపి సోషల్ మీడియా దుస్థితి. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. త్వరలో సీట్ల సర్దుబాటులో కూడా ఒక నిర్ణయానికి రానుంది. అంతకంటే ముందు రెండు పార్టీల మధ్య సమన్వయానికి వరుసుగా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడ వివాదాలు రేగుతున్నాయి. 175 నియోజకవర్గాలకు గాను.. ఒకటి రెండు చోట్ల వివాదాలు కామన్. దానిని వైసిపి అనుకూల మీడియా, సోషల్ మీడియా భూతద్దంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడం వీరికి ఇష్టం లేదు. సీట్ల సర్దుబాటు వద్ద వివాదం వస్తే.. తమకు ప్రయోజనమని వారు ఆశిస్తున్నారు. కానీ ఆ రెండు పార్టీల అధినాయకత్వాలు ఈ వివాదాలను టీ కప్పులో తుఫానుగా పరిగణిస్తున్నాయి.
పొత్తు అనే మాట వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకత్వం మానసికంగా సిద్ధమైంది. కొన్ని సీట్లు వదులుకునేందుకు అంగీకారం తెలిపింది. అటు జనసేన సైతం తాము కోరుకున్న సీట్లు తప్పకుండా దక్కుతాయని భావిస్తోంది. అయితే ఈ క్రమంలో తాము అనుకున్నది జరగకపోయినా.. వెనక్కి తగ్గేందుకు ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. జగన్ ను గద్దె దించాలన్నది ఉమ్మడి లక్ష్యం. ఆపై రాజకీయ అవసరాలు ఉన్నాయి.ఎవరి పార్టీ ప్రయోజనాలు వారికి ఉన్నాయి. దీంతో తప్పకుండా సర్దుబాటు చేసుకోవాల్సిన అని వారి పరిస్థితి ఇరు పార్టీలపై ఉంది. కానీ దిగువ స్థాయి నేతలు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడంలో వెనుకబడ్డారు. అందుకే నియోజకవర్గాల సమన్వయ కమిటీల సమావేశాల్లో రచ్చ జరుగుతోంది. దీనినే వైసీపీ సోషల్ మీడియా హైప్ చేస్తోంది.
వైసీపీలో వర్గ విభేదాలు లేవా? అంటే సమాధానం లేదు. దాదాపు 70 కి పైగా నియోజకవర్గాల్లో వర్గ పోరు నడుస్తోంది. విభేదాలు కొనసాగుతున్నాయి. టికెట్ కోసం నాయకులు గొడవకు దిగుతున్నారు. ఇది వైసిపి సోషల్ మీడియాకు కనిపించదా? అంటే కచ్చితంగా కనిపిస్తుంది. కానీ ప్రత్యర్థి పార్టీలు పొత్తులో భాగంగా కలుస్తుండడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. తొలుత పొత్తు కుదరకుండా అన్ని ప్రయత్నాలు చేసింది. అది కుదరకపోయేసరికి ఇప్పుడు సీట్ల వద్ద వచ్చే జగడాలను మరింత పెంచాలని చూస్తోంది. ఇది గమనించని టిడిపి, జనసేన దిగువ స్థాయి శ్రేణులు కీచులాటలకు దిగుతున్నాయి. నాయకత్వం మాత్రం లైట్ తీసుకుంటోంది. ఇవన్నీ సెట్ అవుతాయని భావిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తు ఖాయం. తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. జనసేన సైతం తాము కోరుకునే సీట్లు కొన్ని దక్కకపోయే ఛాన్స్ ఉంది. కొందరు సీనియర్లు సైతం ప్రత్యామ్నాయ అవకాశాల వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా ఎలా చూసుకున్నా పొత్తు మాత్రం తధ్యం. మరి ఇంత దానికి రెండు పార్టీల మధ్య వివాదాలు ఎందుకు? అధినాయకత్వాల మాదిరిగా కలిసిపోవడం ఇప్పుడు వారి ముందున్న కర్తవ్యం. అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా పొత్తులపై ఎంత విష ప్రచారం చేస్తే.. అది కూటమికే ప్రయోజనం అని.. రెండు పార్టీల మధ్య సమన్వయానికి అదో కారణం అవుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.