రాయలసీమకు కృష్ణా నదీ జలాల మళ్ళింపును కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరట – సముద్రం పాలౌతున్న గోదావరి వరద జలాలను మాత్రం వాడుకోమని ఉచిత సలహా పారేశారట. ఎంత ఉదార స్వభావమో! రాయలసీమకు గోదావరి వరద నీటిని ఎలా తరలించాలో కేసీఆర్ సెలవిస్తారా అంటూ రాజకీయ విశ్లేషకులు, జలవనరుల నిపుణులు టి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
బచావత్ అవార్డు ప్రకారం తమకు కేటాయించిన నీటి నుండే తమ ప్రాజెక్ట్ లు అన్ని రూపొందిస్తున్నామని స్పష్టం చేస్తూ, తెలంగాణయే అన్ని నిబంధనలను గాలికి వదిలివేసి పలు ప్రాజెక్ట్ లను కృష్ణ, గోదావరి నదులపై నిర్మిస్తున్నదని అంటూ ఏపీ ప్రభుత్వం ఘాటుగా కృష్ణ బోర్డు కు సమాధానం ఇచ్చిన అనంతరం కేసీఆర్ గోదావరి జలాలు వాడుకోమని ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం.
పైగా ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై నోరు మెదపడానికి సహితం వెనుకాడారు. `ఇప్పుడు వివాదాలలోకి పొదలచుకోలేదు’ అంటూ గౌరవంగా తప్పుకున్నారు. కృష్ణా నదీ జలాల వినియోగంలో శ్రీశైలం జలాశయం గుండెకాయ వంటిదని అందరికి తెలిసిందే.
శ్రీశైలం జలాశయం నుండి తెలంగాణ చేబడుతున్న ఏ ఒక్క ప్రాజెక్టుకైనా నికర జలాల కేటాయింపు ఉన్నదా? శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (19), కె.సి.కెనాల్ (10), చెన్నయ్ త్రాగు నీటికి (15), మొత్తం 44 టియంసిల నికర జలాలు శ్రీశైలం జలాశయం నుండే సరఫరా కావాలసి ఉంది. కానీ ఈ జవాబు చెప్పడానికి కేసీఆర్ ఎప్పుడు సిద్ధంగా ఉండరు. ఎదురు దాడితో బుకాయించే ప్రయత్నం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న తెలుగు గంగ (29), గాలేరు – నగరి (38) లకు మిగులు/వరద జలాలను, రాయలసీమకు త్రాగు నీటికి 3 టియంసి, మొత్తం 70 టీయంసిలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండే సరఫరా చేయాల్సి ఉంది.
.
విభజన చట్టంలో తెలంగాణకు సంబంధించిన కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. కడకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎస్.ఎల్.బి.సి. ప్రస్తావన లేక పోయినా కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్ విభజన చట్టంలో పేర్కొన్న దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేస్తూ, ఉత్తర తెలంగాణలో ఎటువంటి అనుమతులు లేని ప్రాజెక్ట్ లపైననే శ్రద్ద చూపిస్తూ ఉండటం తెలిసిందే.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్ ప్రాజెక్టు అయితే విభజన చట్టంలో ఎందుకు పేర్కొన లేదు? ఈ ప్రశ్నలకు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉన్నదని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
ఆ.ప్ర. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ – నీవా (40), వెలుగొండ (43.5), మొత్తం 83.5 టీయంసి మిగులు/వరద జలాలు కూడా శ్రీశైలం జలాశయం నుండే సరఫరా కావాలి.
మరోవంక, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నెల్లూరు జిల్లాను కూడా రాయలసీమతో కలిపి లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నట్లు కనబడుతున్నది.
శ్రీశైలం నుండి నికర జలాలు ఎస్.ఆర్.బి.సి.(19),కె.సి.కెనాల్(10)టియంసిలు, మిగులు/వరద జలాలు తెలుగు గంగ(29),హంద్రీ నీవా(40),గాలేరు-నగరి(38),ప్రకాశం జిల్లాలోని వెలుగొండ(43.5),త్రాగు నీరు(3),మొత్తం 182.5 టియంసిలను సరఫరా చేయవలసి ఉంది.
పెన్నా నదిపై ఆధారపడి నెల్లూరు జిల్లాలో నిర్మించిన సోమశిల,కండలేరు ప్రాజెక్ట్ లు కృష్ణానదిపై ఆధారపడినవి కాదని గమనించాలి.