Bhongir Crime: కట్టు తప్పే వ్యవహారాలు కొంపముంచుతాయి.. వెనుకటికి ఈ మాటను మన పెద్దలు ఊరికే చెప్పలేదు. అనుభవంతోనే వారు ఆ మాట అన్నారు. ఇప్పుడు ఈ మహిళ విషయంలో అది పూర్తిగా నిజమైంది.
భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడానికి చెందిన రాపోలు దానయ్యకు శారదకు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నారు. వీరు పంతంగి శివారులో శనిగల గుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడికి దగ్గరలో ఉన్న భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు.. శారద మనస్తత్వం స్థిరంగా ఉండేది కాదు. ఈమె పలువురితో ఇతర సంబంధాలు పెట్టుకున్నట్టు అభియోగాలు ఉంది. ఇవి దానయ్య దృష్టికి రావడంతో ఆమెను అనేక పర్యాయాలు మందలించాడు. గతంలో శారద పంతంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో కలిసి పారిపోయింది.. కొద్ది రోజుల తర్వాత మళ్లీ భర్త వద్దకు వచ్చింది. ఇక ఇటీవల దానయ్య సొంత అన్న కుమారుడితోనే ఆమె వ్యవహారం మొదలు పెట్టింది. ఈ వ్యవహారం దానయ్యకు తెలియడంతో ఇద్దరిని మందలించాడు. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన శివ.. దానయ్యను అంతం చేస్తానని హెచ్చరించాడు.
ఇటీవల దానయ్య సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లి అనే గ్రామానికి వెళ్లాల్సి ఉండేది. అయితే శారద అతడిని ఆ గ్రామానికి వెళ్లకుండా పొలం వద్దకు తీసుకెళ్లింది. అనంతరం శివను పొలం వద్దకు పిలిపించుకుంది. శివ రాగానే.. శారద అతడితో ఏకాంతంగా గడపడం మొదలుపెట్టింది. దానయ్య గమనించి శివ తో గొడవపడ్డాడు. వారిద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దానయ్య కింద పడిపోయాడు. అతడిని శారద గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత శివ అక్కడ ఉన్న రాళ్లతో దానయ్య మీద దారుణంగా దాడి చేసి.. అంతం చేశాడు.
దానయ్య విగత జీవిగా మారడంతో గమనించిన శారద పక్కనే ఉన్న పొలంలో పనిచేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్ళింది. తన భర్త కనిపించడం లేదని చెప్పింది. చుట్టుపక్కల వెతికి చూడగా దానయ్య చనిపోయి కనిపించాడు. ఆ తర్వాత పోలీసులకు ఈ విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులను అనుచరించగా చాలామంది శారద ప్రవర్తన పై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను అధువులకు తీసుకొని విచారించారు. దీంతో ఆమె నిజం ఒప్పుకుంది. అయితే శివ అప్పటికే పారిపోయాడు.
శివ తన దుస్తులను.. మొబైల్ ఫోన్ ను చిట్యాల మండలం గుండ్రంపల్లి చెరువులో పడేశాడు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర పోలీసులకు శివ పట్టుబడ్డాడు. శారద.. శివను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శారదకు అనేక మందితో ఇతర సంబంధాలు ఉన్నాయని.. ఆమెకు సామాజిక మాధ్యమాలలో అనేక రకాల ఖాతాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. చౌటుప్పల్ మండలంలో చాలామంది రాజకీయ నాయకులతో ఆమెకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది.