Petrol Price Hike: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత.. తమిళనాడు మినహా మిగతా ప్రాంతాలలో ఫలితాలు అనుకూలంగా వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఆరోపించినట్టుగానే చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
కొద్ది రోజులుగా దేశంలో డీజిల్, పెట్రోల్ ధరల పెంపు కు సంబంధించి కేంద్రం ప్రజలకు పరోక్షంగా సంకేతాలు ఇస్తోంది. వాటిని శుక్రవారం అమలులో పెట్టి చూపించింది. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచేసింది. లీటర్ కు మూడు రూపాయలు చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలు పెంచేశాయి. శుక్రవారం ఉదయం నుంచి ఈ ధరలు అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. తాజా పెరుగుదల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో డీజిల్ లీటర్ ధర 98.96 రూపాయలకు చేరుకుంది. పెట్రోల్ ధర 110.89 రూపాయలకు చేరుకొంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో వాతావరణం సద్దుమణగకపోవడం.. అమెరికా హెచ్చరికలు.. ఇరాన్ ప్రతి హెచ్చరికలతో అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా పోతుంది. దీంతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. డీజిల్, పెట్రోల్ ధరలను పెంచేశాయి. ఇప్పటివరకు భారత్ ధరలు పెంచలేదు.. ఇప్పటికి పెంచక తప్పలేదు. ఎందుకంటే ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టం వస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో ప్రభుత్వం ధరలు పెంచేసేది.
ధరల పెంపు కంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రాలు పాటించాలని సూచించారు. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. ఎరువుల వాడకం తగ్గించాలని రైతులకు హితవు పలికారు. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని.. డెస్టినేషన్ వెడ్డింగ్ లు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని సూచించారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ తన కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు, మంత్రులు కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను పెంచాలని సూచించారు.
డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిత్యవసరల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ధరల స్థాయి పెరుగుతున్న నేపథ్యంలో.. మార్కెట్లో సామాన్యుడి బడ్జెట్ లెక్కలు తారు మారవుతున్నాయి. ఇప్పుడు ఇంధనం ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంకా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. యుద్ధం తగ్గితే తప్ప దేశంలో మునుపటి పరిస్థితి రాదని విశ్లేషకులు అంటున్నారు.
